సూసైడ్ చేసుకున్న మరో బ్యూటీషియన్…ఈమె కూడా శిరీషే !

suicide-another-beautician-this-is-shirishe

హైదరాబాద్‌ నగరంలో మరో బ్యూటీషియన్ బలవన్మరణానికి పాల్పడిన ఘటన కలకలం రేపుతోంది. కూకట్‌పల్లిలో సత్య శిరీష (35) అనే బ్యూటీషియన్ ఆత్మహత్యకు పాల్పడింది. ఆమె స్వస్థలం పశ్చిమ గోదావరి జిల్లా కొవ్వూరు. ఇంట్లో ఎవరూలేని సమయంలో సత్య శిరీష ఉరేసుకుని ప్రాణాలు తీసుకున్నట్లు తెలుస్తోంది.

సోమవారం (జులై 22) రాత్రి ఈ ఘటన చోటుచేసుకుంది. అయితే.. శిరీషది హత్యా, ఆత్మహత్యా అనేది అనుమానాస్పదంగా మారింది..  సత్య శిరీషను హత్య చేసి, ఆత్మహత్యగా చిత్రీకరిస్తున్నారని బంధువులు ఆరోపిస్తున్నారు. హైదరాబాద్‌లో గతంలో బ్యుటీషియన్ ఆత్మహత్య ఉదంతం సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే.

నాడు ఆత్మహత్య చేసుకున్న మహిళ పేరు కూడా శిరీషే కావడం, ఆమెది కూడా పశ్చిమ గోదావరి జిల్లా కావడం యాదృశ్చికం. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం పశ్చిమ గోదావరి జిల్లా కొవ్వూరు పరిధిలోని దొమ్మేరు గ్రామానికి చెందిన కలగర సత్య శిరీష అనే మహిళ నగరంలోని కేపీహెచ్‌బీ కాలనీలో ఓ బ్యూటీ పార్లర్ నిర్వహిస్తూ స్థానికంగా నివాసం ఉంటోంది.

ఆమె భర్త గోపాల కృష్ణ ఓ ప్రైవేట్ కంపెనీలో చిరుద్యోగిగా పనిచేస్తున్నాడు. ఈ దంపతులకు ఓ కుమారుడు ఉన్నాడు. సోమవారం రాత్రి 7 గంటల సమయంలో గోపాల కృష్ణ విధుల నుంచి ఇంటికి తిరిగి వచ్చే సమయానికి శిరీష ఇంట్లో ఫ్యాన్‌కు వేలాడుతూ కనిపించింది. స్థానికుల సాయంతో శిరీషను ఆమె భర్త వెంటనే ఆస్పత్రికి తరలించారు.

ఆమె అప్పటికే ప్రాణాలు విడిచినట్లు వైద్యులు తెలిపారు. సత్య శిరీష కుటుంబం కొంత కాలంగా ఆర్థిక ఇబ్బందులతో బాధ పడతున్నట్లు స్థానికులు చెబుతున్నారు. ఆమె మరణానికి ఇతర కారణాలేవైనా ఉన్నాయా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.