యంగ్ హీరో నిఖిల్ సిద్ధార్థ్ నటిస్తున్న భారీ పీరియాడిక్ యాక్షన్ డ్రామా ‘స్వయంభు’పై Swayambhu ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. గ్రాఫిక్స్ పనుల్లో జాప్యం కారణంగా సినిమా విడుదల కొంత ఆలస్యమైనప్పటికీ, ప్రస్తుతం తుది దశ పోస్ట్ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఇదిలా ఉండగా, ‘స్వయంభు’ 2026లో విడుదల కాదంటూ వస్తున్న వార్తలను చిత్రబృందం ఇప్పటికే ఖండించింది.
తాజా సమాచారం ప్రకారం, అక్టోబర్ చివరి వారం లేదా నవంబర్లో సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. భారీ బడ్జెట్తో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని సోలో రిలీజ్ చేసేందుకు సరైన తేదీ కోసం నిర్మాతలు కసరత్తు చేస్తున్నారు.
సినిమాకు కేకే సెంథిల్ కుమార్ సినిమాటోగ్రఫీ అందిస్తుండగా, రవి బస్రూర్ సంగీతం సమకూరుస్తున్నారు. అక్టోబర్ 15, 16 తేదీల్లో రజినీకాంత్ నటించిన ‘జైలర్ 2’, ‘రణబాలి’ వంటి చిత్రాలు విడుదలకు సిద్ధంగా ఉండటంతో థియేటర్ల విషయంలో ఎలాంటి ఇబ్బందులు రాకుండా ‘స్వయంభు’ రిలీజ్ను ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం.
‘కార్తికేయ 2’తో పాన్ ఇండియా స్థాయిలో మంచి విజయాన్ని అందుకున్న నిఖిల్ సిద్ధార్థ్ నుంచి వస్తున్న సినిమా కావడంతో ‘స్వయంభు’పై ఆసక్తి మరింత పెరిగింది. పీరియాడిక్ బ్యాక్డ్రాప్, భారీ యాక్షన్ సన్నివేశాలు, గ్రాండ్ విజువల్స్తో ఈ చిత్రం ప్రేక్షకులకు సరికొత్త అనుభూతిని అందిస్తుందని మేకర్స్ భావిస్తున్నారు.
మరోవైపు ‘స్వయంభు’ విడుదల పూర్తయిన వెంటనే తన తదుపరి ప్రాజెక్టులపై నిఖిల్ దృష్టి పెట్టనున్నాడు. ఇప్పటికే లైనప్లో ఉన్న ‘ది ఇండియా హౌస్’, ‘కార్తికేయ 3’ చిత్రాల షూటింగ్స్ను మరింత వేగవంతం చేయాలని ఆయన ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది.
మొత్తానికి ‘స్వయంభు’ 2026లోనే ప్రేక్షకుల ముందుకు రాబోతున్నట్లు స్పష్టమవుతుండగా, అక్టోబర్ చివరి వారం లేదా నవంబర్లో ఏ తేదీని మేకర్స్ లాక్ చేస్తారనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.






