టెస్టు బ్యాట్స్‌మన్‌గా ముద్రపడిపోయిన మురళీ విజయ్

టెస్టు బ్యాట్స్‌మన్‌గా ముద్రపడిపోయిన మురళీ విజయ్

టెస్టు బ్యాట్స్‌మన్‌గా ముద్రపడిపోయిన మురళీ విజయ్‌ ఓ టీ20 మ్యాచ్‌లో భీకర బ్యాటింగ్‌తో ప్రత్యర్థి జట్టుకు ముచ్చెమటలు పట్టించాడు. 52 బంతుల్లో​ 6 సిక్సర్లు, 4 ఫోర్లతో 95 పరుగులు సాధించి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. అంతేకాకుండా టాప్‌ స్కోరర్‌గా నిలిచిన విజయ్‌ మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌ అవార్డు కూడా సొంతం చేసుకున్నాడు. ఐపీఎల్‌- 2011లో భాగంగా చెన్నై సూపర్‌కింగ్స్‌- ఆర్సీబీ జట్ల మధ్య జరిగిన ఫైనల్‌ పోరులో విజయ్‌ ఈ గణాంకాలు నమోదు చేశాడు. డిఫెండింగ్‌ చాంపియన్‌గా సీఎస్‌కే, గ్రూప్‌ స్టేజ్‌లో అత్యధిక పాయింట్లతో ఉన్న ఆర్సీబీ జట్ల మధ్య జరిగిన ఈ ఫైనల్‌ పోరు ఆద్యంతం ఆసక్తిగా సాగింది. ఈ మ్యాచ్‌ జరిగి నేటిక తొమ్మిదేళ్లవుతున్న సందర్భంగా ఆనాటి మ్యాచ్‌ విశేషాలు మీకోసం..

టాస్‌ గెలిచిన సీఎస్‌కే సారథి ధోని ‘మనసులో లక్ష్యంతో బరిలోకి దిగాలనుకోవడం లేదు’అని పేర్కొంటూ బ్యాటింగ్‌ ఎంచుకున్నాడు. దీంతో ఓపెనర్లుగా బరిలోకి దిగిన మైక్‌ హస్సీ, విజయ్‌లు ఆకాశమే హద్దుగా చెలరేగారు. హస్సీ చెలరేగాడు. దీంతో వీరిద్దరు తొలి వికెట్‌కు 159 పరుగుల భారీ భాగస్వామాన్ని నమోదు చేశారు. ఆ తర్వాత మరింత దూకుడుగా ఆడిన విజయ్‌(95) తృటిలో సెంచరీ చేజార్చుకున్నాడు. ఇక మిగతా బ్యాట్స్‌మన్‌ తమ వంతు మెరుపులు మెరిపించడంతో సీఎస్‌కే నిర్ణీత ఓవ​ర్లలో 5 వికెట్ల నష్టానికి 205 పరుగులు చేసింది.

అనంతరం భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ఆర్సీబీ విధ్వంసకర ఆటగాడు క్రిస్‌ గేల్‌పై ఎన్నో ఆశలు పెట్టుకుంది. కానీ అందరి ఆశలను ఆవిరి చేస్తూ డకౌట్‌గా వెనుదిరిగాడు. సౌరభ్‌ తివారి(42) మినహా మిగతా బ్యాట్స్‌మన్‌ అంతగా రాణించకపోవడంతో డానియల్‌ వెటోరీ సారథ్యంలోని ఆర్సీబీ మరోసారి భంగాపాటుకు గురైంది. ఐపీఎల్‌-2009 ఫైనల్‌ మ్యాచ్‌లోనూ అప్పటి డెక్కన్‌ ఛార్జర్స్‌ చేతిలో ఆర్సీబీ ఓటమిచవిచూసిన విషయం తెలిసిందే. ఇక ఈ మ్యాచ్‌లో 58 పరుగుల భారీ విజయం సాధించిన సీఎస్‌కే అటు మ్యాచ్‌తో పాటు ఇటు ఐపీఎల్‌-2011 ట్రోఫీని గెలుచుకుంది. ఈ మ్యాచ్‌లో మురళీ విజయ్‌ హీరోచిత ఇన్నింగ్స్‌ ఆడాడని సారథి ధోని పేర్కొనడం విశేషం.