దేవుడ్ని చేసిన కరోనా: పాలాభిషేకంతో కృతజ్ఞతలు

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకాలు చేస్తున్నారు. అదేంటి దేశం ఇంత క్లిష్ట పరిస్థితుల్లో ఉంటే సీఎం కేసీఆర్ కు పాలాభిషేకం అని ఆశ్చర్యపోతున్నారా? అయితే ఎందుకో తెలుసుకోవాల్సిందే. అయితే పారిశుధ్య కార్మికులకు ఇన్సెంటీవ్స్ ప్రకటించడంపై హర్షం వ్యక్తం చేస్తున్నారు. జీహెచ్ఎంసీ ఆవరణలో సీఎం కేసీఆర్ చిత్ర పటానికి పారిశుధ్య కార్మికులు అంతా పాలాభిషేకం చేసినట్లు తెలుస్తోంది. ఈ ప్రోత్సాహంతో కరోనా కట్టడిపై కార్మికులు మరింత నిబద్ధతతో పని చేస్తారని.. డాక్టర్లు, పోలీసుల మాదిరిగానే పారిశుధ్య కార్మికులు కూడా  ముందడుగు వేస్తూ తమ వృత్తిని సమర్థవంతంగా చేస్తున్నారని మేయర్ బొంతు రామ్మోహన్ తెలిపారు.

కీలక పాత్ర పోషిస్తున్న పారిశుధ్య కార్మికులకు సీఎం కేసీఆర్ ప్రోత్సాహం కింద రూ. 7,800 అందిచడంపై అందరు హర్షం వ్యక్తం చేస్తున్నారు.అదేవిధంగా 27,000 మంది కార్మికులు ఉన్న ఈ జీహెచ్ఎంసీకి గౌరవ ముఖ్యమంత్రి  తీసుకున్న ఈ నిర్ణయంపై ఎల్లప్పుడు రుణపడి ఉంటామని కార్మికులు తెలియజేస్తున్నారు. ఇంకా అవుట్ సోర్సింగ్ కారణంగా 10% జీతాలను కట్ చేస్తున్న క్రమంలో వచ్చే తక్కువ జీతాలతో జీవితాన్ని ఎలా గడపాలి అనుకుంటున్న ఈ సమయంలో గౌరవ ముఖ్యమంత్రి తీసుకున్న నిర్ణయంపై అంతా హర్షం వ్యక్తం చేయడమే కాకుండా కష్ట కాలంలో ప్రభుత్వానికి అండగా నిలుస్తామని తెలిపారు. అంతేకాకుండా తమ పనిని మరింత శ్రద్ధగా చేసుకుంటామని కూడా పారిశుధ్య కార్మికులు మేయర్ కు తెలిపారు. కాగా కరోనా లాంటి మహమ్మారిపై తెలంగాణ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు, రైతుల పట్ల చూపిస్తున్న బాధ్యత, రోజు కూలీలను దృష్టిలో ఉంచుకొని ముఖ్యమంత్రి గారు వ్యవహరిస్తున్న తీరు చాలా గొప్పవని పారిశుధ్య కార్మికులు స్పష్టం చేశారు.