చంద్రబాబు ఏపీలో పుట్టడం మన దౌర్భాగ్యం : ద్వారంపూడి

ఆంధ్రప్రదేశ్ లో అధికార వైసీపీ.. ప్రతిపక్ష టీడీపీల మధ్య లాక్ డౌన్ కాలంలో కూడా రసవత్తర రాజకీయం నడుస్తోంది. తాజాగా వైసీపీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి చంద్రబాబుపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. అసలు చంద్రబాబు వంటి వ్యక్తి రాష్ట్రంలో పుట్టడం మన దౌర్బాగ్యమని ఆయన తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. నిజంగా చంద్రబాబు పర్యావరణాన్ని కాపాడే వ్యక్తే అయితే కష్ణానది కరకట్టపై ఇన్నాళ్లు ఎందుకు నివాసం ఉన్నారో చెప్పాలంటూ ప్రశ్నాస్త్రాన్ని సంధించారు.

అదేవిధంగా కాకినాడలో పేదలకు ఇళ్ళ స్ధలాలు ఇవ్వకుండా టీడీపీ అడ్డుకుంటుందని.. ఇండ్ల స్ధలాల కోసం సేకరించిన పోర్టు భూములను అడవులని సాకుగా చూపించి టీడీపీ నేతలు న్యాయస్ధానాలను ఆశ్రయిస్తున్నారని ఆరోపించారు. అలాగే.. అసలు ఆ భూముల్లో మడ అడవులు లేవని అటవీ శాఖ పేర్కొన్న విషయాన్ని ఆయన గుర్తు చేశారు. అంతేకాకుండా ఇక్కడ మత్స్య సంపద పుట్టదని మత్స్య శాఖ కూడా తేల్చి చెప్పినట్లు ఆయన వివరించారు.

అలాగే ఇంకా ద్వారంపూడి మాట్లాడుతూ.. టీడీపీ బృందం శుక్రవారం పోర్టు భూముల్లో పర్యటించి ఉంటే భూలబ్ధిదారులు తగిన విధంగా వారికి సమాధానం చెప్పేవారని వెల్లడించారు. చినరాజప్ప మంత్రిగా ఉన్నప్పుడు పెద్దాపురంలో కొండల్ని తవ్వేశారని.. అప్పుడు పర్యావణం గుర్తుకు రాలేదా? అంటూ ద్వారంపూడి తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఇండ్ల స్దలాల లబ్ధిదారులతో తాను మాట్లాడి వారిని ఒప్పిస్తానని.. అంతేకాకుండా టీడీపీలో ఎవరు వస్తారో చెప్తే వారిని తానే దగ్గరుండి పోర్టు భూములను చూపిస్తానంటూ ద్వారంపూడి స్పష్టం చేశారు. అలాగే.. లాక్ డౌన్ ఎత్తివేసిన తర్వాత టీడీపీ తీరుపై లబ్ధిదారులతో కలిసి పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని కూడా ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి తెలిపారు.