హింసకు పాల్పడితే.. క్షమించం.. కఠిన శిక్షలుంటాయ్ : ట్రంప్

అమెరికాను ఓ పక్క కరోనా.. మరో పక్క నిరసనలు జనాన్ని ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. పెద్దఎత్తున వెల్లివెత్తుతున్న నిర‌స‌న‌లపై అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ చాలా తీవ్రంగా స్పందించారు. ఆందోళ‌న‌ కారుల్ని త‌రిమేందుకు సైన్యాన్ని రంగంలోకి దింపుతానని వారికి హెచ్చ‌రించారు. జార్జ్ ఫ్లాయిడ్ అనే న‌ల్ల‌జాతీయుడు మిన్నియాపోలీస్ పోలీసుల చెర‌లో చ‌నిపోయారు. దీంతో అమెరికా అంత‌టా నిర‌స‌న‌లు హోరెత్తాయి. దీంతో అనేక న‌గ‌రాల్లో బీభ‌త్సం సృష్టించారు. వైట్‌హౌజ్‌ను కూడా దిగ్భంధించారు. ఓ ద‌శ‌లో భ‌ద్ర‌తా ద‌ళాలు ట్రంప్‌ను శ్వేత‌సౌధంలోని బంక‌ర్‌లోకి కూడా తీసుకువెళ్లారు.

అయితే తాజాగా వైట్‌హౌజ్ నుంచి బ‌య‌ట‌కు వ‌చ్చిన ట్రంప్ మీడియాతో మాట్లాడుతూ.. వివిధ న‌గ‌రాలు, రాష్ట్రాలు త‌మ ప్ర‌జ‌ల్ని కాపాడ‌కోలేక‌పోతే.. అప్పుడు ఆర్మీని రంగంలోకి దింప‌నున్న‌ట్లు ట్రంప్ స్పష్టం చేశారు. అలాగే.. పెద్ద పెద్ద న‌గ‌రాల్లో క‌ర్ఫ్యూ విధించారు. న్యూయార్క్ సిటీలో కూడా క‌ర్ఫ్యూ విధించారు. సోమ‌వారం సాయంత్రం వైట్‌హౌజ్ రోజ్ గార్డెన్ వ‌ద్ద ట్రంప్ మీడియాతో మాట్లాడుతూ నిరసనకారులపై తీవ్ర హెచ్చరికలు చేశారు. అయితే బ‌య‌ట ఆందోళ‌నా కారుల్ని చెద‌రగొడుతున్న శ‌బ్ధాలు వినిపించాయి. జార్జ్ ఫ్లాయిడ్ మృతి ప‌ట్ల ప్ర‌తి అమెరిక‌న్ ప‌శ్చాతాపం వ్య‌క్తం చేస్తున్నార‌ని.. కానీ కొంద‌రి ఆగ్ర‌హానికి ఎవ‌రూ బ‌లికావ‌ద్దు ఆయన వివరించారు.

అంతేకాకుండా దేశ‌రాజ‌ధానిలో జ‌రుగుతున్న లూటీలు, హింస‌.. అవ‌మాన‌క‌ర‌మ‌ని అన్నారు. వాషింగ్ట‌న్ డీసీకి వేలాది మంది సైనికులు, పోలీసు అధికారులు మోహ‌రిస్తున్న‌ట్లు ట్రంప్ తెలిపారు. లూటీలు, విధ్వంసం, దాడులు ఆపేందుకు.. ప్రాప‌ర్టీల‌ను ర‌క్షించుకోవాల్సిన అవ‌స‌రం ఉంద‌ని ఆయన స్పష్టం చేశారు. కాగా హింస‌కు పాల్ప‌డుతున్న వారికి క‌ఠిన శిక్ష‌లు ఉంటాయ‌ని ట్రంప్ తమ సందేశంలో వెల్లడించారు.