రిటైర్‌మెంట్‌ ప్రకటించిన ఉమర్‌ గుల్

రిటైర్‌మెంట్‌ ప్రకటించిన ఉమర్‌ గుల్

రెండు దశాబ్దాలపాటు పాకిస్తాన్‌ క్రికెట్‌కు సేవలందించిన స్టార్‌ పేస్‌ బౌలర్‌ ఉమర్‌ గుల్‌ రిటైర్‌మెంట్‌ ప్రకటించాడు. నేషనల్‌ టీ20 కప్‌లో అతను బలూచిస్తాన్‌ తరపున ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. శుక్రవారం రాత్రి బలూచిస్తాన్‌, సౌతర్న్‌ పంజాబ్‌ జట్ల మధ్య పోరు అనంతరం ఉమర్‌ తన నిర్ణయాన్ని వెల్లడించాడు. అన్ని ఫార్మాట్ల నుంచి రిటైర్‌ అవుతున్నట్టు తెలిపాడు.

ఇక ఈ మ్యాచ్‌లో పరాజయం పాలైన బలూచిస్తాన్‌ టోర్నీ నుంచి తప్పుకోగా.. పంజాబ్‌ జట్టు ప్లే ఆఫ్స్‌కు అర్హత సాధించింది. దాదాపు 20 ఏళ్ల పాటు తనకు మద్దతుగా నిలిచి ఆదరించిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు అంటూ ఉమర్‌ గుల్‌ మీడియా చాట్‌లో పేర్కొన్నాడు. కొత్త ఆటగాళ్లకు దారి ఇచ్చేందుకు, గొప్ప జీవితాన్నిచ్చిన క్రికెట్‌కు మరిన్ని సేవలు చేసేందుకే తాను వైదొలిగినట్టు స్పష్టం చేశాడు.

‘నా క్రికెట్‌ జీవితాన్ని చాలా ఎంజాయ్‌ చేశాను. క్రికెట్‌ జీవితంలో పోరాటాన్ని, విలువలను నేర్పింది. గౌరవాన్ని ఇచ్చింది. కెరీర్‌ ఎదుగులకు చాలా మంది మద్దతుగా నిలిచారు. గొప్పగొప్పవాళ్లతో పరిచయం మంచి అనుభవం. వాళ్లందరికీ కృతజ్ఞతలు. నా ఆటను ఆస్వాదించిన ప్రతి అభిమానికి ధన్యవాదాలు. వాళ్లే నాకు ప్రేరణనిచ్చారు. క్రికెట్‌ నుంచి పక్కకు తప్పుకోవడం కష్టంగానే ఉంది.

నన్ను ఇంత ఉన్నత శిఖరాలకు చేర్చిన క్రికెట్‌ను, నా దేశాన్ని ముందుకు తీసుకెళ్లేందుకు కృషి చేస్తాను’అని ఉమర్‌ గుల్‌ పేర్కొన్నాడు. కాగా, 2002 అండర్‌ 19 వరల్డ్‌కప్‌లో మెరిసిన ఉమర్‌ గుల్‌ 2003లో పాకిస్తాన్‌ జట్టులోకి ఎంట్రీ ఇచ్చాడు. 2004లో భారత్‌-పాకిస్తాన్‌ లాహోర్‌ టెస్టులో ఐదు వికెట్లు తీసి జట్టు విజయంలో తన వంతు పాత్ర పోషించాడు. దాంతో పాకిస్తాన్‌ ముల్తాన్‌ టెస్టు సిరీస్‌ను డ్రా చేయగలిగింది. దశాబ్దం క్రితం టీ20 క్రికెట్‌లో ఉమర్‌ గుల్‌ నెంబర్‌ 1 బౌలర్‌గా కొనసాగాడు.