‘రోమాంచకం’ సినిమా ట్రైలర్ ఈవెంట్లో పాల్గొన్న సెన్సేషనల్ డైరెక్టర్, చిత్ర సమర్పకుడు సందీప్ రెడ్డి వంగా తనదైన స్టైల్లో సరదా వ్యాఖ్యలతో సందడి చేశారు. ఈ సందర్భంగా ఆయన ‘స్పిరిట్’, ‘వారణాసి’ Varanasi సినిమాల రిలీజ్ డేట్స్పై ఆసక్తికరమైన కామెంట్స్ చేశారు.
ప్రభాస్, సందీప్ రెడ్డి వంగా కాంబినేషన్లో తెరకెక్కుతున్న ‘స్పిరిట్’కు, మహేష్ బాబు, రాజమౌళి కలయికలో రూపొందుతున్న ‘వారణాసి’కి మధ్య పెద్దగా గ్యాప్ లేకపోవడంతో రెండు సినిమాల విడుదలపై ఓ విలేకరి ప్రశ్నించారు. ఈ రెండు చిత్రాల మధ్య ఉన్న సమయం సరిపోతుందా అని పదే పదే అడగడంతో సందీప్ రెడ్డి వంగా స్పందించారు.
‘స్పిరిట్’, ‘వారణాసి’ సినిమాల మధ్య దాదాపు 37 రోజుల గ్యాప్ ఉందని, అది సరిపోతుందని ఆయన తెలిపారు. అంతేకాదు, ‘స్పిరిట్’ కంటే ‘వారణాసి’ చాలా పెద్ద సినిమా అంటూ సరదాగా కామెంట్ చేశారు.
అయితే ‘వారణాసి’కి దారి ఇచ్చేందుకు ‘స్పిరిట్’ను పోస్ట్పోన్ చేయాలని మీరు అనుకుంటున్నారా? అంటూ సందీప్ రెడ్డి వంగా చమత్కరించడంతో ఈవెంట్లో నవ్వులు పూశాయి. ఆయన సమాధానం అక్కడి వాతావరణాన్ని మరింత సందడిగా మార్చింది.
ప్రస్తుతం ఈ రెండు భారీ చిత్రాలపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. ప్రభాస్ హీరోగా సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘స్పిరిట్’ 2027 మార్చిలో ప్రేక్షకుల ముందుకు రానుంది. మరోవైపు మహేష్ బాబు హీరోగా ఎస్.ఎస్. రాజమౌళి దర్శకత్వంలో రూపొందుతున్న ‘వారణాసి’ 2027 ఏప్రిల్లో విడుదల కానుంది.
ఒకే సమయంలో రెండు భారీ పాన్ ఇండియా చిత్రాలు బాక్సాఫీస్ బరిలోకి దిగనుండటంతో ఈ పోటీపై సినీ వర్గాల్లో ఆసక్తి నెలకొంది. అయితే రిలీజ్ డేట్స్ మధ్య 37 రోజుల గ్యాప్ ఉండటంతో రెండు సినిమాలకు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభించే అవకాశం ఉందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.




