చిలుకూరు ఫాం హౌస్ లో విజయ నిర్మల అంత్యక్రియలు…కృష్ణ కంటతడి

Vijaya Nirmala Funeral at Chillukuru Farmhouse

న‌టి, ద‌ర్శ‌కురాలు, నిర్మాత విజ‌య నిర్మ‌ల బుధ‌వారం రాత్రి క‌న్నుమూసిన సంగ‌తి తెలిసిందే. ఆమె పార్ధివ దేహాన్ని నాన‌క్ రామ‌గూడ‌లోని ఆమె ఇంటికి తీసుకొచ్చారు. ఈ రోజు స్వ‌గృహంలోనే విజ‌య నిర్మ‌ల భౌతిక కాయాన్ని ఉంచ‌నున్నారు. ఈ నేపథ్యంలో, ఆమెను కడసారి చూసుకునేందుకు సినీ ప్రముఖులు అక్కడకు తరలి వస్తున్నారు. ఆమె భర్త కృష్ణ భౌతికకాయం పక్కనే ఉండి, కంటతడి పెట్టడం అక్కడున్న వారిని కలచివేసింది. కాసేపటి క్రితం మహేష్ బాబు తన భార్య, పిల్లలతో కలసి అక్కడకు వచ్చారు. విజయనిర్మల భౌతికకాయంపై పూలమాల వేసి నివాళి అర్పించారు. పార్థివ దేహానికి చేతులెత్తి నమస్కరించారు. ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, జయసుధ, తమ్మారెడ్డి భరద్వాజ తదితరులు ఇప్పటికే అక్కడకు చేరుకున్నారు. ప‌లువురు ప్ర‌ముఖుల‌కూడా విజ‌య నిర్మ‌ల భౌతిక కాయానికి నివాళులు అర్పిస్తున్నారు. విజయనిర్మల అంతిమ యాత్ర రేపు (శుక్రవారం) ఉదయం 8 గంటలకు నానక్ రామ్ గుడాలోని ఆమె స్వగృహం నుంచి ప్రారంభమవుతుంది. అభిమానుల సంద‌ర్శ‌నార్ధం ఫిలిం చాంబ‌ర్‌లో కొద్ది సేపు ఉంచ‌నున్నారు. ఆ త‌ర్వాత చిలుకూరులోని ఫామ్‌హౌస్‌లో అంతిమ సంస్కారం జరుగుతుంది.