మ్యాచ్‌లో ఓ ఆసక్తికరమైన సన్నివేశం

మ్యాచ్‌లో ఓ ఆసక్తికరమైన సన్నివేశం

భారత్, ఆస్ట్రేలియా మధ్య దుబాయ్ వేదికగా బుధవారం జరిగిన వార్మప్ మ్యాచ్‌లో ఓ ఆసక్తికరమైన సన్నివేశం చోటు చేసుకుంది. టీ20 వరల్డ్‌కప్‌లో భాగంగా పాకిస్థాన్‌తో ఆదివారం భారత్ జట్టు తలపడనుండటంతో.. ఈ మ్యాచ్‌లో విరాట్ కోహ్లీ, జస్‌ప్రీత్ బుమ్రా, మహ్మద్ షమీకి రెస్ట్ ఇచ్చారు. దాంతో.. కెప్టెన్‌గా రోహిత్ శర్మ టాస్‌కిరాగా.. మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఆస్ట్రేలియా కెప్టెన్ అరోన్ ఫించ్ బ్యాటింగ్ ఎంచుకున్నాడు.

ఆస్ట్రేలియా బ్యాటింగ్ చేస్తున్న సమయంలో సబ్‌స్టిట్యూట్ ఫీల్డర్‌గా మైదానంలోకి వచ్చిన విరాట్ కోహ్లీ.. కెప్టెన్ రోహిత్ శర్మ సూచన మేరకు రెండు ఓవర్లు బౌలింగ్ కూడా చేశాడు. పవర్ ప్లే ముగిసే సమయానికి ఆస్ట్రేలియా 34/3తో నిలవగా.. క్రీజులో అప్పటికి స్టీవ్‌స్మిత్, గ్లెన్ మాక్స్‌వెల్ ఉన్నారు. అయినప్పటికీ.. ఇన్నింగ్స్ ఏడో ఓవర్ వేసిన విరాట్ కోహ్లీ.. ఆ ఇద్దరికీ భారీ షాట్ ఆడే అవకాశం ఇవ్వలేదు. కచ్చితమైన లైన్ అండ్ లెంగ్త్‌తో కోహ్లీ మీడియం పేస్ విసరడంతో.. ఆ ఓవర్‌లో మాక్స్‌వెల్, స్మిత్ చెరో రెండు సింగిల్స్ మాత్రమే తీయగలిగారు.

ఆ తర్వాత 13వ ఓవర్‌లోనూ బౌలింగ్‌కి వచ్చిన కోహ్లీ 8 పరుగులు ఇచ్చాడు. 2016 టీ20 వరల్డ్‌కప్‌లోనూ విరాట్ కోహ్లీ బౌలింగ్ చేశాడు.వార్మప్ మ్యాచ్ కావడంతో.. బెంచ్‌పై ఉన్న ఆటగాళ్లు కూడా బౌలింగ్ చేసే వెసులబాటు ఉంటుంది. ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్య బౌలింగ్‌కి దూరంగా ఉంటుండటంతో.. ఆరో బౌలర్ ఆప్షన్ కోసం టీమిండియా తెగ అన్వేషిస్తోంది. తాజాగా కోహ్లీ చక్కగా బౌలింగ్ చేయడంతో.. పాకిస్థాన్‌తో మ్యాచ్‌ ముంగిట భారత్ జట్టుకి సిక్త్స్ బౌలింగ్ ఆప్షన్ దొరికేసిందని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు.