పునీత్‌ లాంటి గొప్ప వ్యక్తిని ఇంత వరకు చూడలేదు

పునీత్‌ లాంటి గొప్ప వ్యక్తిని ఇంత వరకు చూడలేదు

పునీత్‌ రాజ్‌కుమార్‌ లాంటి గొప్ప వ్యక్తిని తాను ఇంత వరకు చూడలేదని హీరో విశాల్‌ అన్నారు. ఆయన నటుడిగానే కాకుండా చాలా మంచి మనిషి అని తెలిపారు. ఎనిమి ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌లో పునీత్‌కు నివాళులు అర్పించిన అనంతరం విశాల్‌ మాట్లాడారు. ‘పునీత్‌ లేరనే విషయాన్ని ఇంకా జీర్ణించుకోలేకపోతున్నాను, ఆయన మరణం చిత్ర పరిశ్రమకే కాదు, సమాజానికి తీరని లోటు. చదవండి: పునీత్‌ రాజ్‌కుమార్‌ నుదిటిన ముద్దు పెట్టిన సీఎం బొమ్మై..

ఫిల్మ్‌ ఇండస్ట్రీలో పునీత్‌లాంటి గొప్ప వ్యక్తిని నేను చూడలేదు. పునీత్ ఈ సమాజానికి ఎన్నో మంచి పనులు చేశారు. చివరికి తన కళ్లు కూడా దానం చేశారు. ఆయన చదివించిన 1800 పిల్లల బాధ్యత ఇకపై నేను చూసుకుంటాను. ఒక స్నేహితుడిగా పునీత్‌ సేవా కార్యక్రమాలకు నా వంతు సాయాన్ని అందిస్తానని మాటిస్తున్నాను అని విశాల్‌ పేర్కొన్నారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతుంది.

విశాల్‌ గొప్ప మనసుకి నెటిజన్లు ఫిదా అవుతున్నారు. విశాల్‌ తీసుకున్న నిర్ణయాన్ని ప్రశంసిస్తున్నారు. ఆర్య మాట్లాడుతూ.. ‘పునీత్‌ సర్‌ లేరనే విషయాన్ని నమ్మలేకపోతున్నా. ఆయన మరణం తీరని లోటు. మిస్‌ యూ సర్‌’ అంటూ ఎమోషన్‌ అయ్యారు. కాగా విశాల్, ఆర్య ప్రధాన పాత్రల్లో ఆనంద్ శంకర్ రూపొందించిన ‘ఎనిమి’ ఈ నెల 4న ప్రేక్షకుల ముందుకు రానుంది.