వైజాగ్ దివ్య హత్య కేసు కొలిక్కి… ఆరుగురిని రిమాండ్ కి తరలింపు..

jail

ఆంధ్రప్రదేశ్ లో సంచలనం రేపిన వైజాగ్ దివ్య హత్యకేసు కీలక మలుపులు తిరుగుతుంది. తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర సంచలనం రేపిన వైజాగ్ దివ్య దారుణ హత్య కేసు నిందితులను పోలీసులు రిమాండ్‌కు తరలించారు. జీవితంలో ఎన్నో విషాదాలను కళ్లారా చూసి అభాగ్యురాలిగా మారిన దివ్య చేరదీసిన వాళ్ల చేతుల్లోనే చిత్రహింసలకు గురై ప్రాణాలు విడిచింది. అయితే ఆమెతో వ్యభిచారం చేయిస్తూ డబ్బులు పంచే విషయంలో నిలదీసిందన్న కారణంగానే దివ్యకు గుండు గీయించి, శరీరమంతా వాతలు పెట్టి, అన్నం పెట్టకుండా కడుపు మాడ్చి చంపేశారు ఆగంతకులు.

అయితే ఈ కేసును రెండ్రోజుల్లోనే చేధించిన విశాఖ పోలీసులు ఆరుగురు నిందితులను తాజాగా రిమాండ్‌కు తరలించారు. కేసు వివరాలను వైజాగ్ ఫోర్త్ టౌన్ పీఎస్ ఇన్‌ఛార్జి సీఐ కోరాడ రామారావు తాజాగా తెలిపారు. విశాఖ అక్కయ్యపాలెం చెక్కుడురాయి భవనం సమీపంలో చనిపోయిన దివ్య ఘటనపై తొలుత పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేశారు. దర్యాప్తులో  భాగంగా ఆమెను అతి కిరాతకంగా హత్య చేసినట్లు తెలిసింది. దీంతో దివ్యతో వసంత అనే మహిళ కొద్ది నెలలుగా వ్యభిచారం చేయిస్తోందని.. ఈమధ్య ఇద్దరి మధ్య డబ్బు పంపకాలకు సంబంధించి భేదాభిప్రాయాలు వచ్చాయని.. వసంత తన చెల్లెలు మంజు, తల్లి ధనలక్ష్మి, మరిది సంజయ్‌ సహకారంతో దివ్య కాళ్లు, చేతులు కట్టేసి, నోటిలో వస్త్రాలు కుక్కి గదిలో బంధించారు. అలాగే..  శరీరంపై 33 చోట్ల వాతలు పెట్టి అతి క్రూరంగా హింసించి చంపారు. కాగా ఆ బాధలు తట్టుకోలేక నీరసించిపోయిన దివ్య ప్రాణాలు విడిచింది. కాగా ఈ కేసులో పోలీసులు ప్రధాన నిందితురాలైన వసంత(జ్యోతి)తో పాటు, ఆమె సోదరి మంజు(సంధ్య), తల్లి ధనలక్ష్మి, మరిది సంజయ్‌, దివ్య పిన్ని కాంతవేణి, గీతపై 302, 201, 343, 324 ఐటీపీ యాక్ట్‌ల కింద కేసులు నమోదు చేసి రిమాండ్‌కు తరలించారు.