మోడీ ట్విట్టర్ అన్ ఫాలో పై వైట్ హౌస్ రెస్పాండ్

అమెరికా అధ్యక్షుడు ఎప్పుడూ ఎలా ఉంటారో అనేది ఎవరూ చెప్పలేని అదో రకమైన వ్యవహారం. ఆయన ముక్కుసూటి మనిషని. ఏమి అనిపిస్తే అది చేస్తుంటారని అంటారు అంతా. ముక్కుసూటి తనం మంచిదే కానీ.. ఆయనకు ఏది అనిపిస్తే అది చేయడం అనేది కొన్ని సందర్భాలను ఇబ్బంది పెట్టే అంశాలుగా చెప్పవచ్చు.

అయితే గత కొన్ని వారాలుగా భారత ప్రధాని నరేంద్ర మోడీ ట్విటర్‌ ఖాతాను ఫాలో అయిన వైట్‌హౌస్‌ తాజాగా ఆయనను ఆన్‌ఫాలో చేసిన విషయం తెలిసిందే. ఇదీ భారత్‌లో తీవ్ర చర్చోపచర్చలకు దారితీసింది. అలాగే.. కలవరపాటుకు కూడా గురిచేసింది. అసలే అమెరికా భారత్ మధ్య ఏం జరుగుతుంది.. ఏం జరగబోతుంది అనేదానిపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. అమెరికా-భారత్‌ల మధ్య దెబ్బతిన్న బంధాలకు ఇదో నిదర్శనంగా కూడా అంతా పలు రకాలుగా వ్యాఖ్యానాలు చేశారు. ఇందుకు సంబంధించి తాజాగా వైట్‌హౌస్‌ వర్గాలు వివరణ ఇచ్చాయి.

అదేమంటే.. సహజంగా అమెరికా అధ్యక్షుడు పర్యటించే దేశాలకు సంబంధించిన దేశాధినేతల అధికారిక ట్విటర్‌ ఖాతాలను వైట్‌హౌస్‌ ఫాలో కావడం అనేది జరుగుతుంటుంది. అధ్యక్షుడి పర్యటనకు మద్దతుగా.. వారి ట్విట్స్‌ను రీట్విట్‌ చేసేందుకు కొద్దికాలం పాటు మాత్రమే ఆ ఖాతాలను ఫాలో అవుతాం అని వెల్లడించాయి. కాగా ‘వైట్‌ హౌస్‌ ట్విటర్‌లో అమెరికా ప్రభుత్వం సీనియర్‌ ట్విటర్‌ అకౌంట్స్‌ ఫాలో చేస్తుంది. అధ్యక్షుడి విదేశీ పర్యటన కాలంలో మాత్రమే అందుకు.. అతిథ్య దేశానికి చెందిన అకౌంట్‌లను కొంతకాలం ఫాలో అవుతుంది’ అని వైట్‌హౌస్‌కు చెందిన ఓ సీనియర్‌ అధికారి స్పష్టం చేశారు.

కాగా అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌ ఫిబ్రవరి ఆఖరి వారంలో ఇండియా పర్యటనకు వచ్చిన విషయం తెలిసిందే. ఆ సమయంలో వైట్‌హౌస్‌ అధికార ట్విటర్‌ అకౌంట్‌.. రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌, ప్రధాని నరేంద్ర మోదీ, భారత ప్రధాని కార్యాలయం, అమెరికాలోని భారత దౌత్య కార్యాలయం, ఇండియాలోని అమెరికా దౌత్య కార్యాలయం, భారత్‌లో అమెరికా రాయబారి ట్విటర్‌ ఖాతాలను ఫాలో కావడం స్టార్ట్ చేసింది. ఆ తర్వాత కొన్ని వారాల పాటు అలాగే ఉంచింది. తాజాగా ఈ వారంలో ఆ ఆరు ఖాతాలను వైట్‌హౌస్‌ ట్విటర్‌లో ఆన్‌ఫాలో చేయడంతో సర్వత్రా ఆసక్తి నెలకొంది. దీంతో వైట్‌హౌస్‌ ట్విటర్‌ లో వివరణ ఇచ్చింది. ఇప్పుడు వైట్ హైస్ అనుసరిస్తున్న ఖాతాల సంఖ్య 13కు తగ్గడం న్యూ ట్విస్ట్ గా చెప్పవచ్చు.