భర్తని ప్రెషర్‌ కుక్కర్‌తో తలపై కొట్టిన భార్య

భర్తని ప్రెషర్‌ కుక్కర్‌తో తలపై కొట్టిన భార్య

తాగుబోతు భర్త రోజూ వేధించే వాడు. అయినా సహించింది. బుధవారం రాత్రి యాసిడ్‌ పోసే ప్రయత్నం చేశాడు. ప్రాణ రక్షణ కోసం ఆమె ప్రెషర్‌ కుక్కర్‌తో తలపై మోదింది. దీంతో అతను అక్కడికక్కడే కుప్పకూలి మృతి చెందాడు. ఈ సంఘటన ప్రొద్దుటూరులోని రామేశ్వరంలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. రామేశ్వరానికి చెందిన దొర్నిపాటి నాగేశ్వరరావు (45), భార్య లక్ష్మీశ్రీదేవికి బాలసుబ్రమణ్యం, దుర్గాసాయి అనే ఇద్దరు కుమారులు ఉన్నారు. నాగేశ్వరరావుకు సొంత లారీ ఉంది. బాడుగలు ఒప్పుకొని అతనే డ్రైవర్‌గా వెళ్తుంటాడు.

రోజూ మద్యం సేవించి భార్య, కుమారులతో గొడవ పడేవాడు. ఈ క్రమంలో బుధవారం రాత్రి అతిగా మద్యం సేవించి ఇంటికి వచ్చాడు. రాత్రి పొద్దుపోయే వరకు భార్య, కుమారులతో గొడవ పడి వారిని కొట్టాడు. ఈ క్రమంలో ఇంట్లో ఉన్న యాసిడ్‌ బాటిల్‌ తీసుకొని.. వారిపై పోసే ప్రయత్నం చేశాడు. ప్రాణ రక్షణ కోసం ఆమె ప్రెషర్‌ కుక్కర్‌ తీసుకొని భర్త తలపై బలంగా కొట్టింది. తలకు తీవ్ర గాయం కావడంతో అతను అక్కడికక్కడే కుప్పకూలి పోయాడు. రక్తస్రావం ఎక్కువై కొద్ది సేపటి తర్వాత మృతి చెందాడు. డీఎస్పీ సుధాకర్, సీఐ నాగరాజు గురువారం ఉదయం సంఘటన స్థలానికి చేరుకొని పరిశీలించారు. మృతుడి సోదరుడు సతీష్‌ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు.