ఉరి వేసుకొని యువతి ఆత్మహత్య

ఉరి వేసుకొని యువతి ఆత్మహత్య

ఎంవీపీ కాలనీ సెక్టార్‌–6లోని ఓ ఇంట్లో పత్రుల సుగుణ అనే యువతి ఉరి వేసుకొని ఆత్మహత్య ఘటన కొత్తమలుపు తిరుగుతోంది. ప్రియుడి వేధింపుల కారణంగానే ఆమె మరణించినట్లు పోలీసుల ప్రాథమిక విచారణలో తేలినట్టు సమాచారం. ఈ ఘటనపై ఇంటి యజమాని ఫిర్యాదు మేరకు ఎంవీపీ పోలీసులు సోమవారం కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. సుగుణ మద్దిలపాలెంలోని ఓ స్టోర్‌లో ఉద్యోగం చేస్తోంది. ఇంటి ఓనర్‌ ఇచ్చిన సమాచారం మేరకు సుగుణ వివాహిత అని తొలుత ఎంవీపీ పోలీసులు భావించారు.

అయితే పోలీసు విచారణలో ఆమెకు ఇంకా పెళ్లికాలేదని తేలినట్లు తెలిసింది. గత కొంత కాలంగా ప్రియుడితో కలిసి సుగుణ సహజీవనం చేస్తుండడంతో పాటు ఎంవీపీ సెక్టార్‌–6లోని ఓ ఇంటిని అద్దెకు తీసుకొని వారు భార్యభర్తలుగా చలామని అవుతున్నట్లు విచారణలో బయటపడినట్టు సమాచారం. ఆమె తల్లిదండ్రులు గుంటూరులో ఉండగా.. ఒక్కతే ఇక్కడ ఉంటున్నారు. కొద్ది రోజులుగా సుగుణకు ప్రియుడికి మధ్య మనస్పర్థలు తలెత్తాయి. ఆమె ఒంటిపై గాయాలు కూడా ఉన్నట్లు పోలీసులు గుర్తించారు.

దీనికి సంబంధించి పోలీసులకు సూసైడ్‌ నోట్‌ కూడా లభించినట్లు తెలిసింది. దర్యాప్తు ముమ్మరం చేసిన పోలీసులు ఇప్పటికే ఈ ఘటనపై ప్రియుడిని విచారించినట్లు సమాచారం. ఈ కేసు సంబంధించి పూర్తి వివరాల కోసం సీఐ రమణయ్యను సంప్రదించగా.. సుగుణకు ప్రియుడి వేధింపులు ఉన్నట్లు తెలిపారు. ఇంకా దర్యాప్తు జరుగుతుందని, పూర్తయ్యాక వివరాలు తెలియజేస్తామని వెల్లడించారు.