బురారీ కేసు… ఆత్మహత్యలకు ప్రేరేపించింది ఆమే ?

Woman 'Tantrik' Geeta Maa Questioned In Delhi Burari Deaths

సంచలనం సృష్టించిన‌ ఢిల్లీలోని బురారీ సామూహిక ఆత్మహత్యల కేసులో పోలీసులు దర్యాప్తు కొనసాగుతోంది. ఈ కేసులో మిస్టరీ క్రమంగా వీడుతున్నట్టు కనిపిస్తోంది. కేసును దర్యాప్తు చేస్తున్న క్రైం బ్రాంచ్ పోలీసులు ‘గీతా మా’ అనే తాంత్రికురాలిని అదుపులోకి తీసుకున్నారు. భాటియా కుటుంబాన్ని ఆత్మహత్యలకు ప్రేరేపించింది తానేనని గీతా మా కెమెరా సాక్షిగా పోలీసుల ముందు అంగీకరించినట్టు తెలుస్తోంది. 11 మందిని ఆత్మహత్యలకు పురిగొల్పింది తానేనని చెబుతున్న గీతా మా వీడియోను శుక్రవారం ‘సీఎన్ఎన్ న్యూస్ 18’ ప్రసారం చేసింది. ‘‘వారిని ఆత్మహత్యల వైపు నడిపించింది నేనే. వారు తమ జీవితాలను ఎలా అంతం చేసుకోవాలో వివరంగా చెప్పా’’ అని అందులో పేర్కొంది.

భాటియా ఇంటిని నిర్మించిన కాంట్రాక్టర్ వద్ద పనిచేసిన ఓ ఉద్యోగి కుమార్తే గీతా మాగా అధికారులు గుర్తించారు. అయితే, ఆమె అంగీకారాన్ని అధికారులు ఇంకా ధ్రువీకరించలేదు. భాటియా ఇంటిని నిర్మించిన కాంట్రాక్టర్ కుమార్తే గీతా మాగా అధికారులు గుర్తించారు. భాటియా నివాసానికి తరుచూ ఈమె వచ్చిపోయినట్టు సమీపంలోని సీసీటీవీ ఫుటేజ్‌ల్లో గుర్తించారు. వారి ఆత్మహత్యలతో తాంత్రికురాలు గీతా మాకు సంబంధం గురించి ఇంకా ఎలాంటి ఆధారాలను గుర్తించలేదని పోలీస్ వర్గాలు భావిస్తున్నాయి. అటాప్సీ నివేదికలో మాత్రం వారు ఇష్టపూర్వకంగానే ఆత్మహత్యలకు పాల్పడినట్టు తేలింది. భాటియా ఇంట్లోంచి స్వాధీనం చేసుకున్న డైరీలు కూడా ఇందుకు ఊతమిస్తున్నాయి. కాగా, గీతా మాను విచారించిన అనంతరం మరిన్ని వివరాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది.