ఆంధ్రప్రదేశ్‌లో ఇకపై కఠిన చర్యలు

ఆంధ్రప్రదేశ్‌లో ఇకపై కఠిన చర్యలు

ఆంధ్రప్రదేశ్‌లో కరోనా వైరస్ కొత్త వేరియంట్‌ ఒమిక్రాన్‌ కేసు నమోదైన నేపథ్యంలో జగన్ సర్కారు అలర్ట్ అయింది. ఒమిక్రాన్ వ్యాప్తిని అరికట్టేందుకు ఇకపై కఠిన చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. రాష్ట్రంలో ఒమిక్రాన్‌ వ్యాప్తి చెందకుండా మరింత కఠినంగా ఆంక్షలు అమలు చేయాలన్నారు. తాడేపల్లిలోని తన క్యాంప్‌ కార్యాలయంలో వైద్య ఆరోగ్య శాఖపై సోమవారం సీఎం జగన్ సమీక్ష నిర్వహించారు. ఈ కార్యక్రమానికి డిప్యూటీ సీఎం ఆళ్ల నాని, ఉన్నతాధికారులు హాజరయ్యారు.

రాష్ట్రంలో కరోనా పరిస్థితులు, వైద్య, ఆరోగ్య శాఖపై సమీక్షించిన సీఎం జగన్‌.. ఒమిక్రాన్‌ వ్యాప్తి చెందకుండా తీసుకోవాల్సిన చర్యలపై అధికారులకు దిశానిర్దేశం చేశారు. రాష్ట్రంలో మరో వారం రోజుల్లో జీన్‌ సీక్వెన్సింగ్‌ ల్యాబ్‌ ఏర్పాటు చేస్తామని అధికారులు సీఎంకు వివరించారు. రాష్ట్రంలో ఫీవర్‌ సర్వే కొనసాగిస్తామని.. ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఈ నెలాఖరు నాటికి 144 పీఎస్‌ఏ ప్లాంట్లు అందుబాటులోకి తీసుకొస్తామని అధికారులు సీఎం దృష్టికి తీసుకొచ్చారు. అలాగే ఎయిర్‌పోర్టుల్లో ప్రయాణికులకు ఆర్టీపీసీఆర్‌ పరీక్షలు చేస్తున్నామని ముఖ్యమంత్రికి అధికారులు వివరించారు. ఒమిక్రాన్‌ నేపథ్యంలో ఆంక్షలు విధించినట్లు వెల్లడించారు.

ఈ సందర్భంగా వీలైనంత త్వరగా వ్యాక్సినేషన్‌ ప్రక్రియను పూర్తి చేయాలని అధికారులను సీఎం జగన్ ఆదేశించారు. జనవరిలోగా నిర్దేశించిన వయస్సుల వారందరికీ డబుల్‌ డోస్‌ వ్యాక్సిన్ ఇచ్చేలా చర్యలు తీసుకోవాలన్నారు. వ్యాక్సినేషన్‌ ప్రక్రియను వీలైనంత త్వరగా పూర్తి చేయడమే కొవిడ్‌ నివారణకు ఉన్న మార్గమని సీఎం జగన్ అభిప్రాయపడ్డారు.ఆరోగ్యశ్రీ సేవలను ప్రజలు సమర్థంగా ఉపయోగించుకొనేందుకు ప్రత్యేక యాప్‌ను అందుబాటులోకి తీసుకురావడానికి అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు సీఎం జగన్ వెల్లడించారు.

యాప్‌ ద్వారా ప్రజలు తమ సందేహాలను నివృత్తి చేసుకొనేలా అధికారులు ఏర్పాట్లు చేయాలని సూచించారు. అలాగే రాష్ట్రంలో కొత్త మెడికల్‌ కళాశాలల నిర్మాణాన్ని వేగవంతం చేయాలని.. క్యాన్సర్‌ రోగులకు సూపర్‌ స్పెషాలిటీ సేవలు అందించాలని ఆదేశించారు. మూడు ప్రాంతాల్లో కనీసం మూడు సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రులు అందుబాటులో ఉండాలని స్పష్టం చేశారు. దీని వల్ల ఇతర ప్రాంతాలకు వెళ్లాల్సిన అవసరం రోగులకు ఉండదన్నారు.

క్యాన్సర్‌ రోగులకు పూర్తిస్థాయిలో ఆరోగ్యశ్రీ కింద సేవలు అందించాలని.. ఆస్పత్రుల్లో పెట్టిన ఆరోగ్య మిత్ర వ్యవస్థను బలోపేతం చేయాలని సూచించారు.రోగులకు సమర్థంగా సేవలు అందేలా వ్యవస్థను రూపొందించాలని సీఎం జగన్ ఆదేశాలు జారీ చేశారు. రాష్ట్రంలో 108, 104 వాహనాలు అత్యంత సమర్థంగా ఉండాలని స్పష్టం చేశారు. వీటి నిర్వహణలో ఎలాంటి లోపాలకు తావు ఉండకూడదని స్పష్టం చేశారు.