చంద్రబాబుపై వైఎస్సార్‌సీపీ లీడర్ మండిపాటు

చంద్రబాబుపై వైఎస్సార్‌సీపీ లీడర్ మండిపాటు

వైఎస్సార్‌సీపీ రాష్ట్రఅధికార ప్రతినిధి సి.రామచంద్రయ్య ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ గురించి మాట్లాడుతూ పాదయాత్రలో ఇచ్చిన ప్రతి హామీని అమలు చేస్తున్నారని తెలిపారు. టీడీపీ నేతలు నిన్ననే ప్రారంభమైన రైతు భరోసా పథకంలో అవకతవకలు జరిగాయని అనడం హాస్యాస్పదంగా ఉందంటూ రైతు భరోసా డబ్బులను నేరుగా ఖాతాల్లోకి వేయడంతో రైతులు ఆనందంగా ఉన్నారని పేర్కొన్నారు. రైతులను నిలువునా ముంచిన చంద్రబాబు నాయుడు రాష్ట్రంలో కరువు సమయంలో పట్టించుకోకుండా నిర్లక్ష్యం చేసి ఇప్పుడు నీతులు చెప్పడం ఏంటి అని విమర్శించారు.

2004లో దివంగతనేత వైఎస్సార్‌ ప్రవేశపెట్టిన ఉచిత విద్యుత్‌ను 2004లో ప్రవేశ పెట్టినపుడు చంద్రబాబు వ్యతిరేకించిన ఘటన గుర్తు చేశారు. ఇచ్చిన హామీలను గడువు కంటే ముందే నెరవేరుస్తున్న సీఎం జగన్‌ గురించి రాష్ట్రాన్ని దివాళా తీయించిన టీడీపీ నేతకి వైఎస్‌ జగన్‌ గురించి మాట్లాడే అర్హత లేదన్నారు. బ్రోకర్లను, బినామీలను మధ్యవర్తిత్వం కోసమే బీజేపీలోకి పంపారని, బీజేపీకి దగ్గరయ్యేందుకు చంద్రబాబు ప్రయత్నిస్తున్నారని చెప్పారు.