సచిన్‌కు సవాల్‌ విసిరిన యువరాజ్‌ సింగ్‌

సచిన్‌కు సవాల్‌ విసిరిన యువరాజ్‌ సింగ్‌

సోషల్‌ మీడియాలో చాలా ఆక్టీవ్‌గా ఉండే టీమిండియా మాజీ ఆల్‌రౌండర్‌ యువరాజ్‌ సింగ్‌ వరుస చాలెంజ్‌లతో అభిమానులను అలరించే ప్రయత్నం చేస్తున్నాడు. గతంలో ‘కీప్‌ ఇట్‌ అప్‌’ ఛాలెంజ్‌ పేరుతో సచిన్‌ టెండూల్కర్‌, హర్భజన్‌ సింగ్‌, రోహిత్‌ శర్మలకు యువీ సవాల్‌ విసిరిన విషయం తెలిసిందే. అయితే ఈ ఛాలెంజ్‌ను వినూత్నంగా పూర్తి చేసి అటు యూవీని ఇటు అభిమానులను సర్‌ప్రైజ్‌ చేశాడు. అంతేకాకుండా చివర్లో సచిన్‌ ఇచ్చిన ట్విస్ట్‌ అదిరిపోతుంది. ఇక ఊహించని విధంగా ‘కీప్‌ ఇట్‌ అప్‌’ ఛాలెంజ్‌ను సచిన్‌ పూర్తిచేయడంతో యువీ మైండ్‌ బ్లాక్‌ అయింది.

తాజాగా యువీ ‘వంటింట్లో వంద’ పేరిట మరో కొత్త ఛాలెంజ్‌ను తెరపైకి తీసుకొచ్చాడు. దీనిలో భాగంగా వంటింట్లో అప్పడాల కర్రతో బంతి కిందపడకుండా వందసార్లు కొట్టాలి. కళ్లకు గంతలు కట్టుకొని ఈ ఛాలెంజ్‌ను పూర్తి చేసిన యూవీ సచిన్‌కు సవాల్‌ విసిరాడు. ‘మాస్టర్‌ ఇప్పటివరకు మైదానంలో మీరు ఎన్నో రికార్డులను తిరగరాశారు. ఈ సారి ‘కిచెన్‌లో సెంచరీ’ రికార్డును బ్రేక్‌ చేయండి. అంతేగానీ వంటింట్లోని మిగతా సామాగ్రిని బ్రేక్‌ చేయకండి. నేను పూర్తి చేసిన ఛాలెంజ్‌కు సంబంధించిన ఫుల్‌ వీడియో లెంగ్త్‌ కారణంగా పోస్ట్‌ చేయలేదు’ అంటూ యువీ పేర్కొన్నాడు. ప్రస్తుతం ఈ ఛాలెంజ్‌కు సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో తెగ వైరల్‌ అవుతోంది.