అక్కమగడుతో సుఖాలు.. ఆపై అబార్షన్ వికటించి మృతి

ఆంధ్రప్రదేశ్ లోని శ్రీకాకుళం జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. 17ఏళ్ల బాలికపై అక్క భర్త లైంగిక దాడికి పాల్పడటంతో గర్భం దాల్చింది. అయితే అది కాస్తా తెలిసి అబార్షన్ చేయించుకొనేందుకు ప్రయత్నించారు. ఈ క్రమంలో వైద్యం వికటించి ఆమె ప్రాణాలు కోల్పోయింది. కంచిలి మండలంలోని ఓ గ్రామానికి చెందిన దంపతులకు ఇద్దరు కుమార్తెలు. పెద్దకుమార్తెకు కోల్‌కతాలో పనిచేసే ఓ వ్యక్తితో కొంతకాలం క్రితం పెళ్లైంది. చిన్న కూతురు పదో తరగతి వరకు చదివి ఇంట్లోనే ఉంటోంది. అయితే ఈ ఏడాది జనవరిలో అత్తింటికి వచ్చిన పెద్ద అల్లుడు మరదలిని మాటల్లో పెట్టి మొత్తానికి ఏదోలా లోబరుచుకున్నాడు. దాంతో పలుమార్లు లైంగిక దాడికి పాల్పడి కోల్‌కతాకు వెళ్లి పోయాడు.

అయితే బాలిక గర్భం దాల్చింది. ఘటనపై తల్లిదండ్రులు ఆరాతీస్తే… అదంతా అల్లుడి పని అని తేల్చి చెప్పేసింది. దీంతో వెంటనే ఫోన్ చేసి అల్లుడిని నిలదీయగా లాక్‌డౌన్ పూర్తికాగానే ఇంటికొస్తానని.. అప్పుడు మాట్లాడుకుందామని చెప్పాడు. అయితే ఈ విషయం బయటకు తెలిస్తే ఇరు కుటుంబాల పరువు పోతుంది కాబట్టి అబార్షన్ చేయించండి.. అందుకయ్యే ఖర్చు తాను భరిస్తానని అల్లుడు నమ్మించాడు. మొత్తానికి అల్లుడి మాటలు నమ్మిన తల్లిదండ్రులు బాలికను వారం రోజుల క్రితం సోంపేటలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తీసుకెళ్లి అబార్షన్ చేయించారు. ఇంటికి వెళ్లాక బాలిక ఆరోగ్యం పూర్తిగా క్షీణించింది.

మూడురోజుల క్రితం మళ్లీ అదే హాస్పిటల్‌కు తీసుకెళ్లారు. అక్కడ పరిస్థితి మరింత దిగజారడంతో శ్రీకాకుళంలోని జిల్లా ప్రభుత్వాసుపత్రికి ఆమెను తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ బాలిక ఆదివారం రాత్రి మృతి చెందింది. ఈ విషయం తెలుసుకున్న కంచిలి పోలీసులు బాలిక తల్లిదండ్రులను విచారించి వివరాలు తెలుసుకున్నారు. తమ అల్లుడి చేసిన నిర్వాకం వల్ల కూతురిని కోల్పోవాల్సి వచ్చిందని వారు ఆవేదన వ్యక్తం చేశారు. కాగా బాలిక తల్లి ఫిర్యాదు ఆధారంగా కంచిలి ఎస్‌.ఐ.దుర్గా ప్రసాద్‌ కేసు నమోదు చేసి దర్యాప్తు నిర్వహిస్తున్నారు.