ఉప్పల్ లో చిచ్చు..కారులో అలజడి.!

బి‌ఆర్‌ఎస్ అభ్యర్ధుల ఎంపిక విషయంలో ఇంకా రచ్చ నడుస్తూనే ఉంది. ఎక్కువ మంది సిట్టింగులని మార్చకపోయిన..మార్చిన స్థానాల్లో రచ్చ నడుస్తోంది. బి‌ఆర్‌ఎస్, కాంగ్రెస్ నుంచి వచ్చిన ఎమ్మెల్యేలకు సీట్లు ఇవ్వడంపై కూడా చిచ్చు రగులుతుంది. ఇదే క్రమంలో ఉప్పల్ బి‌ఆర్‌ఎస్ పార్టీలో పెద్ద రచ్చ నడుస్తోంది. అక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యే భేతి సుభాష్ రెడ్డిని కాదని, కాంగ్రెస్ నుంచి వచ్చిన బండారి లక్ష్మారెడ్డికి సీటు ఇవ్వడంపై పెద్ద పోరు జరుగుతుంది.

ఇటీవలే కే‌సి‌ఆర్..115 మందితో అభ్యర్ధులని ప్రకటించారు. ఈ క్రమంలో ఉప్పల్ లో బి‌ఆర్‌ఎస్ అభ్యర్ధిగా లక్ష్మారెడ్డిని ప్రకటించారు. దీనిపై బి‌ఆర్‌ఎస్ లో మొదట నుంచి వచ్చిన మాజీ మేయర్ బొంతు రామ్మోహన్, ఎమ్మెల్యే సుభాష్ రెడ్డి అసంతృప్తిలో ఉన్నారు. వాస్తవానికి భేతి, బొంతుల మధ్య ఎప్పటినుంచో ఉప్పల్ లో ఆధిపత్య పోరు నడుస్తోంది. ఇక వీరిద్దరిలో ఒకరికి సీటు వస్తుందని అంతా అనుకున్నారు. కానీ వీరిద్దరిని కాదని కాంగ్రెస్ నుంచి వచ్చిన లక్ష్మారెడ్డికి కే‌సి‌ఆర్ సీటు ఇచ్చారు. దీంతో భేతి అసంతృప్తితో ఉన్నారు.

ఉప్పల్ టికెట్‌పై వారం రోజుల్లో పునరాలోచన చేయకుంటే కచ్చితంగా భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తామని భేతి బి‌ఆర్‌ఎస్ అధిష్టానానికి వివరణ ఇచ్చారు. ఉప్పల్‌లో 2001 పార్టీ ఆవిర్భావం నుంచి తాను గులాబీ జెండా పట్టినా అని, నియోజకవర్గంలో పార్టీని కాపాడినా… 2009లో టికెట్ ఇవ్వకపోయినా పార్టీ కోసం పని చేసినా. నాపై కేసులు పెట్టినా భయపడకుండా ముళ్ల బాటలో నడిచినా. 2014లో ఇప్పుడు టికెట్ దక్కిన వ్యక్తికి డిపాజిట్ రాలేదు. ఆ ఎన్నికల్లో నాకు 60వేల పైచిలుకు ఓట్లు వచ్చాయి. నేను 2018లో 48వేల ఓట్ల మెజారిటీతో గెలిచినా.” అంటూ భేతి చెప్పుకొచ్చారు.

ఉరితీసే వారికి కూడా చివరి కోరిక అడుగుతారని, కానీ తనకు ఆ ఛాన్స్ కూడా ఇవ్వలేదని అన్నారు. మొత్తానికి కే‌సి‌ఆర్‌ని కలిశాక తన కార్యాచరణ ప్రకటిస్తానని భేతి చెప్పుకొచ్చారు. అయితే ..2014లో బి‌ఆర్‌ఎస్ నుంచి ఉప్పల్ లో భేతి పోటీ చేసి ఓడిపోయారు. అప్పుడు లక్ష్మారెడ్డి కాంగ్రెస్ నుంచి పోటీ చేసి 34 వేల ఓట్లు తెచ్చుకుని మూడోస్థానంలో నిలిచారు. 2018లో పొత్తులో కాంగ్రెస్, టి‌డి‌పికి ఉప్పల్ సీటు ఇచ్చింది. దీంతో అక్కడ లక్ష్మారెడ్డి పోటీ చేయడానికి కుదరలేదు. టి‌డి‌పి నుంచి వీరేంద్ర గౌడ్ పోటీ చేశారు. ఇకభేతి బి‌ఆర్‌ఎస్ నుంచి పోటీ చేసి 48 వేల ఓట్ల మెజారిటీతో గెలిచారు. ఇక తర్వాత లక్ష్మారెడ్డి బి‌ఆర్‌ఎస్ లోకి వచ్చారు. ఇప్పుడు భేతిని కాదని లక్ష్మారెడ్డికి సీటు ఇచ్చారు. మరి భేతి బి‌ఆర్‌ఎస్ లో ఉంటారో జంప్ అవుతారో చూడాలి.