లాక్ డౌన్ తర్వాత థియేటర్స్ లోకి తొలి రిలీజ్ పవర్ స్టార్…. వకీల్ సాబ్..

ఏ మాత్రం తగ్గని పవన్ కళ్యాణ్ క్రేజ్

కరోనా వైరస్, లాక్ డౌన్ విధింపుతో అన్ని రంగాలు మూతపడ్డాయి. సినీరంగం పూర్తిగా దెబ్బతిన్నది. లాక్‌డౌన్ కారణంగా గత రెండు నెల‌లుగా థియేట‌ర్స్ అన్నీ మూత ప‌డ్డ విషయం తెలిసిందే. ఈ నేప‌థ్యంలో కొంద‌రు నిర్మాత‌లు ఓటీటీల‌ని ఆశ్ర‌యిస్తున్నారు. ఇప్ప‌టికే ఓటీటీలో విడుద‌ల కానున్న‌ కొన్ని చిత్రాల‌కి సంబంధించి రిలీజ్ డేట్‌లు కూడా ప్ర‌క‌టించారు. అయితే తాజాగా సీఎం కేసీఆర్‌తో ప‌లువురు సినీ ప్ర‌ముఖులు చ‌ర్చ‌లు జ‌రిపిన త‌ర్వాత థియేట‌ర్స్ రీ ఓపెన్‌పై కాస్త స్ప‌ష్ట‌త వ‌చ్చిన‌ట్టు తెలుస్తుంది.

ముఖ్యంగా ఆగ‌స్ట్‌లో తిరిగి థియేట‌ర్స్ తెరుచుకొనే అవకాశాలు మెండుగా ఉన్నాయనే ప్రచారం సాగుతుంది. ఈ సమయంలో అలా ఆగష్టులో థియేటర్స్ ఓపన్ అయితే ముందుగా వ‌చ్చే సినిమా ప‌వ‌న్ క‌ళ్యాణ్ న‌టించిన వకీల్ సాబ్ అనే టాక్ ముమ్మరంగా వినిపిస్తోంది. కాగా దాదాపు రెండేళ్ళ త‌ర్వాత ప‌వ‌న్ తిరిగి మేక‌ప్ వేసుకోగా.. ఈ సినిమా కోసం ఫ్యాన్స్ ఆస‌క్తిగా ఎదురు చూస్తున్నారు. వ‌కీల్ సాబ్ ముందు విడుద‌లైతే జ‌నాల‌లో కూడా కాస్త జోష్ వ‌స్తుంద‌ని భావించి ఈ సినిమాని ముందుగా రిలీజ్ చేస్తార‌నే టాక్ వినిపిస్తోంది. అలాగే.. ఆ త‌ర్వాత వి, అరణ్య, నిశ్శబ్దం వంటి బడా సనిమాలు కూడా ప్రేక్ష‌కుల ముందుకు ఒక్కొక్క‌టిగా రిలీజ్ కానున్నాయి.