ప్రియుడిపై పెట్రోల్ పోసి నిప్పంటించిన భార్య

పెళ్లైన తర్వాత కూడా మరో సంబంధాన్ని చాలా సహజమైపోయింది సమాజంలో. అదేంటో ఇలాంటి కేసులే తర్వాత్తర్వాత చాలా దారుణాలకు దారితీస్తున్నాయి. తాజాగా ఆంధ్రప్రదేశ్ లోని కృష్ణా జిల్లాలో ఇలాంటి దారుణమే చోటుచేసుకుంది. ప్రియుడి తనను పట్టించుకోవడం లేదని… కక్ష పెంచుకున్న ఓ వివాహిత ఏకంగా పెట్రోల్ పోసి నిప్పు అంటించింది. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన ప్రియుడు విజయవాడలోని ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు.

అసలు విషయంలోకి వెళ్తే… వివాహేతర సంబంధం ఓ వ్యక్తి ప్రాణం మీదకు తెచ్చింది. కృష్ణా జిల్లా జి.కొండూరు మండలంలో తాజాగా ఈ ఘటన జరిగింది. మండలంలోని హెచ్‌.ముత్యాలంపాడు గ్రామానికి చెందిన ఓ మహిళతో కందులపాడుకు చెందిన కోటేశ్వరరావు అనే వ్యక్తి చాన్నాళ్లుగా వివాహేతర సంబంధం సాగిస్తున్నాడు. ఇద్దరికీ అప్పటికే వివాహాలు అయ్యాయి. ప్రియుడి మోజులో భర్తతో విడిపోయిన ఆ మహిళ కందులపాడు అడ్డరోడ్డు వద్ద బడ్డీ కొట్టు పెట్టుకుని జీవిస్తోంది. దీంతో కోటేశ్వరరావు తరుచూ అక్కడికి వస్తూ ప్రియురాలితో రాసలీలలు సాగిస్తూ ఉండేవాడు.

తాజాగా ఆ మహిళకు, కోటేశ్వరరావుకు మధ్య చిన్నపాటి గొడవ జరిగింది. దీంతో కోటేశ్వరరావు కొంతకాలంగా ప్రియురాలికి ముఖం చాటేశాడు. ఆమె ఎన్నిసార్లు ఫోన్ చేసినా.. ఇతరులతో కబురు పెట్టినప్పటికీ… అతడే మాత్రం స్పందించ లేదు. తాజాగా అతడు ఫ్రెండ్‌తో కలిసి ప్రియురాలి ఇంటికి వెళ్లాడు. తనను ఎందుకు దూరం పెట్టావంటూ ఆ మహిళ కోటేశ్వరరావుతో గొడవకు దిగింది.

ఇద్దరి మధ్య మాటామాటా పెరిగి గొడవ పెద్దదైంది. దీంతో ఆ మహిళ కోపం పట్టలేక కోటేశ్వరావుపై పెట్రోల్ పోసి నిప్పంటించింది. దీంతో షాక్ కు గురైన అతడి ఫ్రెండ్ చుట్టుపక్కల వారి సాయంతో మంటలను ఆర్పివేసి జి.కొండూరులోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించాడు. పరిస్థితి విషమంగా మారడంతో అక్కడి నుంచి విజయవాడలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తీసుకెళ్లాడు. కాగా శరీరం భాగా కాలిపోయిందని… కోటేశ్వరరావు మృత్యువుతో పోరాడుతున్నాడని వైద్యులు తెలిపారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.