ఆటో డ్రైవర్ తో అఫైర్…ప్రాణం తీసింది…రజనీ కాంత్ పట్టించాడు ?

affair with auto driver

రజనీకాంత్ బొమ్మ ఉన్న ఆటో ఓ హత్య కేసును ఛేదించేందుకు పోలీసులకు ఉపయోగపడింది. నెల్లూరులోని రామలింగపురంలో నివసిస్తున్న బొందిలి నిర్మలాబాయి (45) ఓ ప్రైవేటు స్కూల్లో క్లర్క్‌గా పనిచేస్తున్నారు. ఆమె భర్త రమేశ్ సింగ్ మూడేళ్ల క్రితమే చనిపోయాడు. కుమారుడు బెంగళూరులో పనిచేస్తుండగా, కుమార్తె తిరుపతిలో చదువుకుంటోంది. దీంతో ఆమె నెల్లూరులో ఒంటరిగా జీవిస్తోంది. వారం రోజుల క్రితం నిర్మల హత్యకు గురైంది. కత్తితో ఆమెను పదిసార్లు పొడిచి చంపారు. అనంతరం ఆమె మృతదేహాన్ని తగలబెట్టారు. ఆమె ఇంటి నుంచి మంటలు వస్తుండడంతో అప్రమత్తమైన ఇరుగుపొరుగు వారు పోలీసులకు సమాచారం అందించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుల కోసం మూడు బృందాలను ఏర్పాటు చేసి గాలింపు మొదలుపెట్టారు. ఈ సందర్భంగా నిర్మల ఇంటి సమీపంలో ఉన్న సీసీ టీవీ కెమెరాలను పరిశీలించారు. నటుడు రజనీకాంత్ బొమ్మతో ఉన్న ఓ ఆటో హత్యకు కొద్ది సమయం ముందు నిర్మల ఇంటి వద్దకు వచ్చి ఆగింది. హత్య తర్వాత ఆటో వెళ్లిపోయింది. క్లూ దొరికినట్టు భావించిన పోలీసులు రజనీకాంత్ ఫొటోతో ఉన్న ఆటో కోసం గాలించారు. మొత్తంగా పదివేల ఆటోలను చెక్ చేయగా ఎట్టకేలకు నిన్న నగరంలోని అపోలో ఆసుపత్రి జంక్షన్ వద్ద రజనీకాంత్ ఫొటోతో ఉన్న ఆటో కనిపించింది. వెంటనే అప్రమత్తమైన పోలీసులు ఆటో డ్రైవర్ రామస్వామి అలియాస్ వేమసాని శ్రీకాంత్ ను అదుపులోకి తీసుకున్నారు. నిర్మలను తానే హత్య చేసినట్టు విచారణలో నిందితుడు అంగీకరించాడు. ఆమెను చంపి బంగారు చైను, గాజులు, చెవి కమ్మలు, రూ.2వేల నగదును దోచుకున్నట్టు చెప్పాడు. అనంతరం ఇంట్లోని దినపత్రికలను ఆమె మృతదేహంపై వేసి తగలబెట్టినట్టు చెప్పాడు. ప్రమాదం జరగడం వల్లే ఆమె మరణించిందన్న భావన కలిగేలా, వెళ్తూవెళ్తూ గ్యాస్‌ను లీక్ చేశానని పోలీసులకు చెప్పాడు. నిర్మలబాయికి కొన్నాళ్ల క్రితం అరవిందనగర్‌ ప్రాంతానికి చెందిన ఆటోడ్రైవర్‌ రామస్వామి అలియాస్‌ వేమసాని శ్రీకాంత్‌ అలియాస్‌ రజనీకాంత్‌తో పరిచయం ఏర్పడింది. అది వివాహేతర సంబంధంగా మారింది. తరచూ రామస్వామి నిర్మలబాయి ఇంటికి వచ్చి వెళ్లేవాడు. రామస్వామికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. అతను చెడు వ్యసనాలకు బానిసై అప్పులు ఎక్కువగా చేశాడు. ఎలాగైనా వాటిని తీర్చాలన్న ఆలోచనతో నిర్మలబాయి వంటిపై ఉన్న నగలను దోచుకోవాలని పథకం పన్నాడు.  అందుకే ఆమెను హతమార్చాడని పోలీసుల విచారాణలో తేలింది.