ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంపై నిప్పులు చెరిగిన బీజేపీ నేతలు

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంపై నిప్పులు చెరిగిన బీజేపీ నేతలు

ఇటీవలి వరకు టీటీడీ ఆస్తుల అంశంపై పలువురు బీజేపీ నేతలు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. అయితే ఇప్పుడు జగన్ ప్రభుత్వానికి అనుకూలంగా కీలక వ్యాఖ్యలు చేశారు ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి రామ్ మాధవ్, ఎంపీ జీవీఎల్ నర్సింహారావు. బీజేపీ నేతలు చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి.

అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తయిన సందర్భంగా ముఖ్యమంత్రి జగన్ ప్రభుత్వానికి శుభాకాంక్షలు తెలిపారు రామ్ మాధవ్. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఏపీని అభివృద్ధి పథంలో తీసుకు వెళ్లేందుకు జగన్ ధృడ సంకల్పంతో కృషి చేస్తున్నారని ప్రశంసించడం గమనార్హం.

దేవదాయ ఆస్తుల అంశాన్ని సాధుసంతుల కమిటీ ద్వారా నిర్ణయం తీసుకుంటామని చెప్పడం హర్షించదగ్గ విషయమన్నారు. ఏపీకి, కేంద్రానికి మధ్య సత్సంబంధాలు ఉన్నాయని చెప్పారు. పార్లమెంటు సమావేశాల్లో కూడా వైసీపీ ఎంపీలు బీజేపీ, ఎన్డీయేకు మద్దతుగా నిలుస్తున్నారన్నారు.

విభజన చట్టంలోని హామీలతో పాటు అంతకుమించి కొత్తగా ఏర్పడిన ఏపీకి అన్ని విధాలుగా సహాయసహకారాలు అందించేందుకు ప్రధాని మోడీ కూడా సిద్ధంగా ఉన్నారని చెప్పారు. 15వ ఆర్థిక సంఘం కూడా ఏపీకి ఎంత ఎక్కువ ఇవ్వగలమో అంతమేరకు సకారాత్మకంగా ఆలోచన చేసిందన్నారు. ఏపీలో కొన్ని వివాదాలు ఉన్నప్పటికీ సీఎంను జవాబుదారీగా చేయాల్సిన అవసరం లేదన్నారు.

బీజేపీకే చెందిన ఎంపీ జీవీఎల్ నర్సింహా రావు కూడా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. నిమ్మగడ్డ రమేష్ కుమార్ టీడీపీకి అనుకూలంగా వ్యవహరించారనే ఆరోపణలు ఉన్నాయన్నారు. భవిష్యత్తులో అయినా ఆయన రాజ్యాంగ పరిధికి లోబడి పని చేయాలన్నారు. అదే సమయంలో ప్రభుత్వానికి కూడా చురకలు అంటించడం గమనార్హం.

ఏపీ రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌గా నిమ్మగడ్డను తొలగిస్తూ జారీ చేసిన ఉత్తర్వులను రద్దు చేస్తూ ఏపీ హైకోర్టు తీర్పు ఇవ్వడంపై మాట్లాడుతూ.. ఇది వైసీపీ సర్కార్‌కు కనువిప్పు అన్నారు. తొందరపాటు నిర్ణయాలు తీసుకుంటే ఇలాగే ఉంటుందని ప్రభుత్వం పెద్దలు ఇకనైనా తెలుసుకోవాలన్నారు. రాజ్యాంగం ప్రకారం ప్రభుత్వాల అధికారులకు కూడా కొన్ని పరిమితులు ఉంటాయని గ్రహించాలన్నారు.