మైదాపిండి.. పురగుల మందుతో బోండాలు… ఇద్దరు మృతి

తెలియక చేసిన తప్పు రెండు నిండు ప్రాణాలను తీసింది. తమిళనాడులోని రాణిపేట జిల్లా ఎస్‌ఆర్‌ కండ్రిగ గ్రామంలో రైతు పెరియస్వామి (65), భార్య లక్ష్మి (57), కుమారుడు శివకుమార్‌ (27), కోడలు భారతి (22) నివసిస్తున్నారు. తాజాగా పెరియస్వామి బోండాలు చేసేందుకు మైదాపిండి తీసుకొచ్చాడు. దాంతో పాటు మిరప తోటకు క్రిమిసంహారక మందు కూడా తీసుకొని వచ్చాడు. ఈ విషయం తెలియని కోడలు భారతి రెండూ కలిపి బోండాలు వేసింది.ఆ తర్వాత కోడలు చేసిన ఆ బోండాలను నలుగురూ తిన్నారు. దాంతో కాసేపటికే.. వారికి వాంతులు, విరోచనాలు అయ్యాయి.

గ్రామస్తులు వారిని షోలింగర్‌ ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అక్కడ పరిస్థితి విషమించడంతో చెన్నైలోని ఓ ప్రైవేట్‌ ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ.. భారతి, శివకుమార్‌ మృతిచెందారు. పెరియస్వామి, లక్ష్మి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు వెల్లడించారు. కాగా అరక్కోణం తాలూకా పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. పెళ్లైన ఏడాదిలోనే దంపతులు మృతి చెందడంతో గ్రామంలో విషాద చాయలు నెలకొన్నాయి.