షాకింగ్… తుపాకీ గురిపెట్టిన గ్యాంగ్ కిడ్నాప్… ఆపై తాళి కట్టించారు

ప్రపంచమంతా కరోనా దెబ్బకు దిమ్మతిరిగి పోతుంటే.. బెదిరింపులు .. మోసాలు మాత్రం చెలరేగిపోతున్నాయి. తాజాగా తుపాకీలు పట్టుకుని కిడ్నాప్‌కి బయల్దేరారు. రివర్స్‌లో యువకుడిని కిడ్నాప్ చేసి తెచ్చి అమ్మాయితో బలవంతంగా వివాహం జరిపించేందుకు ట్రై చేశారు. తలకి తుపాకీ గురిపెట్టి తాళి కట్టమనడంతో ఏంచేయాలో అర్థంకాని ఆ యువకుడు.. అదిరిపోయే షాకిచ్చాడు. సోషల్ మీడియా పుణ్యమాని ఆ వీడియో వైరల్ కావడంతో విషయం వెలుగులోకి వచ్చింది. అమ్మాయిని కిడ్నాప్ చేసి పెళ్లి చేసుకోవడం చూశాం కానీ.. ఇలా అబ్బాయిని బెదిరించి పెళ్లి చేయాలను వడమేంటని విచిత్రంగా వీక్షిస్తున్నారు. అయితే ఈ ఘటన బీహార్‌లో జరిగింది.

అసలేం జరిగింది అంటే… యువకుడిని కిడ్నాప్ చేసి బలవంతంగా అమ్మాయిని ఇచ్చి పెళ్లి చేసేందుకు గ్యాంగ్ యత్నించింది. బీహార్ లోని వైశాలి జిల్లాలో జరిగిన ఈ ఘటన సర్వత్రా కలకలం రేపింది. జందహా మార్కెట్‌ ప్రాంతానికి చెందిన యువకుడు అమిత్(24) కిడ్నాప్‌కు గురయ్యాడు. అతని తండ్రి ముసఫిర్ రాయ్‌తో కలసి ఆస్పత్రికి వెళ్తుండగా తుపాకులతో వచ్చిన కొందరు వ్యక్తులు అతనిని అపహరించి సమీపంలోని సమస్తిపూర్ జిల్లా బరుణ రసల్‌పూర్‌కి తీసుకెళ్లారు. అక్కడికి వెళ్లాక తనకు బలవంతంగా పెళ్లి చేయబోతున్నారన్న విషయం యువకుడికి బోధపడింది.

అక్కడ తలపై తుపాకీ గురిపెట్టి.. చేతిలో తాళి పెట్టి.. ఎదురుగా అమ్మాయిని కూర్చోబెట్టి పెళ్లి చేసుకోమని చెప్పడంతో కంగుతిన్నాడు. అమ్మాయితో బలవంతంగా పెళ్లి జరిపించారు. అయితే కిడ్నాప్ నుంచి తప్పించుకున్న అమిత్ తండ్రి రాయ్ పోలీసులను ఆశ్రయించడంతో రసల్‌పూర్ చేరుకుని అదిరిపోయే ట్విస్ట్ ఇచ్చారు. అమిత్‌ని రక్షించి అతని తండ్రితో పంపించేశారు. వివాహం చేసుకున్న అమ్మాయిని ఆమె తల్లిదండ్రులకి అప్పగించడంతో కిడ్నాప్ కథ సుఖాంతం అయింది కానీ… ఆ విషయాన్ని పోలీసులు మాత్రం వదిలేలా లేరు. ఈ కిడ్నాప్, బెదిరింపులు వంటి నేరాల కింద కేసులు నమోదు చేసి.. ఆ ఘటనకు పాల్పడిన నావల్ రాయ్, వినోద్ రాయ్‌ సహా ఐదుగురిపై విచారణ జరుపుతున్నారు.