రాహుల్ తో భేటీ చారిత్రాత్మకమేనా ? లేదా..!

CBN Meets Rahul For Naidu Front

ఉప్పు, నిప్పుగా ఉండే కాంగ్రెస్, టీడీపీలు ఎట్టకేలకు ఒక్క గూటికి చేరాయి. కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీతో ముఖ్యమంత్రి చంద్రబాబు భేటీ అయ్యారు. బీజేపీయేతర పార్టీలన్నింటినీ ఒక తాటిపైకి తెచ్చి పోరాటం దిశగా సిద్దం చేసే ప్రయత్నంలో టీడీపీ అధినతే చంద్రబాబు కీలకమైన అడుగు వేశారు. ఆయన వెంట ఎంపీలు గల్లా జయదేవ్, కనకమేడల, సీఎం రమేష్, కంభంపాటి రామ్మోహన్ తదితర నేతలు ఉన్నారు. మోడీని ఢీకొట్టాలంటే ఓ బలమైన కూటమి ప్రత్యామ్నాయంగా ఉంటే ప్రజలు కచ్చితంగా ఆ కూటమికే పట్టం కడతారన్న అభిప్రాయం కాంగ్రెస్, టీడీపీ పక్షాల నేతల్లో వ్యక్తమయింది. దీనికి సంబంధించి చంద్రబాబే మరింత చొరవ తీసుకోవాలని కాంగ్రెస్ అధ్యక్షుడు కోరినట్లు తెలుస్తోంది. కూటమిలో కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పటికీ ప్రధానమంత్రి అభ్యర్థి అనే ప్రస్తావన.. తీసుకు రాకుండా.. ఎన్నికల ఫలితాలను బట్టి.. అప్పుడు నిర్ణయం తీసుకునే నిర్ణయం తీసుకుంటేనే అందరూ కలిసి బీజేపీకి వ్యతిరేకంగా పోరాడటానికి ముందుకు వస్తారన్న అభిప్రాయ నేతల మధ్య జరిగింది. తొలుత ఢిల్లీకి వెళ్లిన బాబు ఎన్సీపీ నేత శరద్ పవార్, నేషనల్ కాన్ఫరెన్స్ నేత ఫరూక్ అబ్దుల్లాలను కలిశారు. సాధారణ ఎన్నికలు, దేశంలో జరుగుతున్న పరిణామాలు, కేంద్ర ప్రభుత్వం రాజకీయ కక్షసాధింపు చర్యలతో పాటు వివిధ పార్టీల నేతలు, సంస్థలపై జరుగుతున్న దాడులపై చర్చించారు.

farooq abdullah and  sharad pawar
అనంతరం రాహుల్ ని కూడా కలిసి భేటీ అయిన దేశాన్ని, ప్రజాస్వామ్యాన్ని కాపాడాల్సిన బాధ్యత ఇప్పుడు అందరిపై ఉందని ఇదే అంశంపై కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ, తాను చర్చించామని తెలిపారు. కాంగ్రెస్, టీడీపీల కలయికపై కొందరికి కొన్ని సందేహాలు ఉన్నాయని కానీ, ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించే లక్ష్యంతోనే తాము కలిశామని చెప్పారు. దేశాన్ని రక్షించడం కోసం చేతులు కలిపామని బాబు తెలిపారు. దేశ ప్రతిపక్ష నేతగా రాహుల్ పైన, దేశంలోని సీనియర్ నేతగా తనపైన దేశాన్ని కాపాడాల్సిన బాధ్యత ఉందని చెప్పారు. బీజేపీని వ్యతిరేకించే అన్ని పార్టీలను ఏకతాటిపైకి తెస్తామని తెలిపారు. భవిష్యత్ కార్యాచరణను త్వరలోనే ప్రకటిస్తామని తెలిపారు.

Delhi Politics Revolves Around CBN

దేశంలో ప్రస్తుతం ఏం జరుగుతోందో అందరూ గమనిస్తున్నారని ప్రజాస్వామ్యాన్ని అపహాస్యంపాలు చేయడమే కాకుండా, కీలక వ్యవస్థలను నాశనం చేస్తున్నారని చంద్రబాబు మండిపడ్డారు. సీబీఐ, సుప్రీంకోర్టు, ఆర్బీఐలతో పాటు గవర్నర్ వ్యవస్థను కూడా భ్రష్టు పట్టిస్తున్నారని ఆయన మండిపడ్డారు. ఇలాంటి రాజ్యాంగ విరుద్ధమైన కార్యకలాపాలను అడ్డుకోవాల్సిన అవసరం ఉందని చెప్పారు. ఎన్నో ఏళ్లుగా తాను రాజకీయాల్లో ఉన్నానని… ఇంతటి దారుణమైన పాలనను తన జీవితంలో చూడలేదని అన్నారు. అయితే కాంగ్రెస్ లేకుండా కూటమి బలంగా ఉండదని చంద్రబాబు భావిస్తున్నారు. అందుకే కాంగ్రెస్ కి వైరం ఉన్న పార్టీలను కూడా కూటమిలో చేర్చేందుకు చర్చలు జరుపుతున్నారు. కాంగ్రెస్ పార్టీ వైపు నుంచి ప్రాంతీయ పార్టీలకు ఇబ్బందులు లేకుండా చూసేలా వ్యవహరిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ కూడా జాతీయ ప్రయోజనాల కోసం తగ్గి వ్యవహరించేందుకు సిద్దమయ్యింది. కర్ణాటకలో జరిగిన పరిణామాలే దీనికి నిదర్శనమని విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ క్రమంలో కాంగ్రెస్ పెద్ద పార్టీగా బీజేపీ ప్రత్యామ్నాయ కూటమికి చంద్రబాబు ప్రయత్నాలు కీలకంగా మారాయి.