మరో భారీ పతనం

మరో భారీ పతనం

కరోనా సవాళ్లకు తోడు రియల్టీ రంగం సంక్షోభంతో ప్రపంచంలో రెండవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ (చైనా) మందగమనంలో ఉంది. ఈ తరుణంలో తాజాగా మరో భారీ పతనం చైనాను కోలుకోలేని దెబ్బతీసింది. ప్రపంచంలోనే ప్రఖ్యాత నిర్మాణ సంస్థగా పేరు దక్కించుకున్న ఎవర్‌గ్రాండ్‌.. డిఫాల్టర్‌ మరకను అంటించుకునే టైం దగ్గర పడింది.చైనా ప్రాపర్టీ దిగ్గజం ‘ఎవర్‌గ్రాండ్‌’(ఎవర్‌గ్రాండే) షేర్లు భారీగా పతనం అయ్యాయి.

పదిహేడు రోజుల విరామం అనంతరం.. గురువారం ఉదయం హాంకాంగ్‌ స్టాక్‌ ఎక్సేంజ్‌లో 14 శాతం పతనాన్ని చవిచూశాయి. ఇప్పటికే ఆర్ధిక సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్న ఎవర్‌గ్రాండ్‌.. యూనిట్‌లలో ఒకదానిని 2.6 బిలియన్‌ డాలర్లకు అమ్మేయాలనుకున్న ప్రయత్నం విఫలం అయ్యింది. దీంతో షేర్లు ఒక్కసారిగా పతనం అవుతున్నాయి. ఇది అంతర్జాతీయ మార్కెట్‌లో వణుకు పుట్టిస్తోంది.

ఈ ప్రభావంతో గృహ నిర్మాణ రంగం మందగమనంలో కూరుకుపోయి ప్రపంచవ్యాప్తంగా మెటల్‌ షేర్లకు డిమాండ్‌ తగ్గవచ్చనే ఆందోళనలు అధికమయ్యాయి.ఎవర్‌గ్రాండే ప్రాపర్టీస్‌ సర్వీసెస్‌లో 51 శాతం భాగాన్ని.. హోప్‌సన్‌ డెవలప్‌మెంట్‌ హోల్డింగ్స్‌కు అమ్మాలనుకున్న ప్రయత్నాన్ని విరమించుకోవాలనుకుంటున్నట్లు బుధవారం అధికారికంగా ఒక ప్రకటన చేసింది కూడా. అయితే హోప్‌సన్‌ డెవలప్‌మెంట్‌ మాత్రం ఎవర్‌గ్రాండ్‌ విధించిన తలాతోకలేని షరతుల వల్లే తప్పుకుంటున్నట్లు ప్రకటించడం విశేషం.

చైనాకు చెందిన అతిపెద్ద(రెండవ) రియల్ ఎస్టేట్ డెవలపర్.. గ్లోబల్ ఫార్చ్యూన్ 500 కంపెనీల్లో ఒకటిగా ఉండేది. సంస్థ జారీ చేసిన బాండ్లపై సెప్టెంబర్‌ 23నాటికి కట్టాల్సిన 80 మిలియన్‌ డాలర్లవడ్డీని చెల్లించలేనని ఎవర్‌గ్రాండ్‌ కిందటి నెలలో ప్రకటించడంతో ఒక్కసారిగా ఇన్వెస్టర్లు షాక్‌కు గురయ్యారు. అంతేకాదు 305 బిలియన్‌ డాలర్ల అప్పుల ఊబిలో కూరుకుపోయినట్లు నిర్ధారణ కావడంతో రియల్టీ రంగం ఉలిక్కిపడింది. అయితే ఈ సంక్షోభాన్ని తాము తట్టుకుని నిలదొక్కుకుంటామన్న ఎవర్‌గ్రాండ్‌ ఫౌండర్‌ క్జూ జియాయిన్‌(హుయి కా యాన్‌) హామీ ఫలించడం లేదు.