గాయనిగా, డబ్బింగ్ ఆర్టిస్టుగా చిన్మయి శ్రీపాద కు ఉన్న గుర్తింపు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అయితే, తమిళ సినీ గేయ రచయిత వైరముత్తు తనను లైంగికంగా వేధించాడంటూ చిన్మయి చేసిన ఆరోపణలు అప్పట్లో తీవ్ర చర్చకు దారితీశాయి. ఆ తర్వాత 2018లో దేశవ్యాప్తంగా ఊపందుకున్న మీటూ ఉద్యమ సమయంలో, తమిళ డబ్బింగ్ యూనియన్ అధ్యక్షుడు రాధా రవిపై కూడా ఆమె లైంగిక వేధింపుల ఆరోపణలు చేసింది. ఈ పరిణామాల నేపథ్యంలో డబ్బింగ్ యూనియన్ చిన్మయిపై నిషేధం విధించింది.
దీర్ఘ విరామం తర్వాత 2023లో లియో సినిమాతో చిన్మయి మళ్లీ రంగప్రవేశం చేసింది. తాజాగా కరుప్పు చిత్రంలో త్రిష కు వాయిస్ ఇచ్చి మరోసారి ప్రేక్షకులను ఆకట్టుకుంది. అయితే, ఈ సినిమాకు డబ్బింగ్ చెబుతున్న సమయంలో తాను ఎదుర్కొన్న మానసిక సంఘర్షణ గురించి చిన్మయి భావోద్వేగంగా మాట్లాడింది.
స్టూడియోలో కొన్ని ఎమోషనల్ సన్నివేశాలకు డబ్బింగ్ చెప్పేటప్పుడు గతంలో ఎదురైన అనుభవాలు ఒక్కసారిగా గుర్తొచ్చాయని, వాటి వల్ల కన్నీళ్లు ఆపుకోలేకపోయానని ఆమె వెల్లడించింది. ఆ క్షణాల్లో తాను ఎంతో భావోద్వేగానికి లోనయ్యానని చెప్పింది. భవిష్యత్తులో ఎలాంటి ఆంక్షలు లేకుండా, తన సొంత పరిశ్రమలో స్వేచ్ఛగా పనిచేసే రోజులు రావాలని ఆకాంక్షిస్తున్నానని చిన్మయి పేర్కొంది.
