Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
వైద్యో నారాయణ హరీ… వైద్యుడికి దేవుడి స్థానం దక్కిన దేశం ఇది. అయితే పల్లె ప్రజలకు ఆ వైద్యుడు దర్శనం నిజంగా దేవుడి దర్శనం అంత పనిగా మారింది. ఈ పరిస్థితుల్లో ఆ పల్లె ప్రజలకు తక్షణ, చిన్న చిన్న వైద్య అవసరాలు తీర్చేది అక్కడే వుండే ఆర్.ఎం.పి లు లేదా పి.ఎం.పి లు. వారు చేసేది ఎంత మంచి పని అయినా దాన్ని ఓ తప్పుగా చూసే విధాన నిర్ణయాలు ఓ వైపు , సంబంధిత శిక్షణ కోర్స్ కి సరైన గుర్తింపు లేని పరిస్థితి ఇంకో వైపు. ఈ పరిస్థితుల్లో గ్రామీణ వైద్యులు తాము చేసే పనికి తగిన గుర్తింపు రావాలంటే పారామెడిక్స్ శిక్షణకి గుర్తింపు అవసరమని భావించారు. 45 ఏళ్లుగా అందుకోసం పోరాడుతున్నారు. ఆర్.ఎం.పి లేదా పి.ఎం.పి సేవలని ప్రభుత్వాలు గుర్తించి వారికి చట్టబద్దత కల్పించాలన్న లక్ష్యంతో మొదలైన ఈ పోరాటాన్ని ఆయన నాయకత్వం సరైన దారిలో నడిపించింది. గ్రామీణ వైద్యుల కల నెరవేర్చింది. ఆయనే ప్రస్తుతం స్వచాంద్ర మిషన్ ఎగ్జిక్యూటివ్ వైస్ చైర్మన్, తెలుగునాడు కమ్యూనిటీ పారామెడిక్స్ అసోసియేషన్ అధ్యక్షుడు సి.ఎల్. వెంకటరావు.
తాను స్వయంగా డాక్టర్ అయి ఉండి కూడా గ్రామీణ వైద్యుల డిమాండ్ ని అర్ధం చేసుకున్న వెంకటరావు ఓ పద్ధతి ప్రకారం ఈ పోరాటాన్ని ముందుకు నడిపారు. వై.ఎస్ ప్రభ చూసి మహామహా రాజకీయనేతలు భయపడుతున్న వేళ 2008 జనవరి 18 నుంచి 28 దాకా కర్నూల్ నుంచి హైదరాబాద్ దాకా చేసిన పాదయాత్ర ఈ సుదీర్ఘ పోరాటంలో ఓ మైలురాయి. దాదాపు ఐదు వేల మందితో 355 కిలోమీటర్ల ఈ పాదయాత్ర తరువాత ఇచ్చిన విజ్ఞాపనతో అప్పటి సీఎం వై.ఎస్ కూడా కదలాల్సి వచ్చింది. అయితే ఎం.సి.ఐ అనుమతి లేకపోవడం వంటి సాంకేతిక కారణాలతో వైద్యుల కల నెరవేరలేదు.
2014 లో టీడీపీ మళ్ళీ అధికారంలోకి వచ్చాక, చంద్రబాబు సీఎం అయ్యాక ఆయనతో సన్నిహితంగా ఉంటున్న వెంకటరావు ఈ సమస్య కి కారణమైన అవరోధాలు అధిగమించడానికి భగీరథ ప్రయత్నమే చేశారు. దీంతో చట్టపరమైన సమస్యల పరిష్కారానికి 9 మందితో ఓ కమిటీ వేసిన ప్రభుత్వం, కో ఆర్డినేటర్ గా వెంకటరావు ని నియమించింది. ఈ కమిటీ ఆధ్వర్యంలో సీఎం చంద్రబాబు, ఆరోగ్య మంత్రి కామినేని శ్రీనివాస్, న్యాయ నిపుణుడు, అడ్వకేట్ జనరల్ తో వివిధ దఫాలుగా చర్చించి ఈ సమస్యకి పరిష్కారం దొరికేలా చేశారు. సి. పి శిక్షణ తిరిగి కొనసాగేలా చేయడంలో ప్రభుత్వాన్ని ఒప్పించడంలో వెంకట్రావు కీలక పాత్ర పోషించారు. పైకి ఆయన చేసిన పోరాట ఫలం గ్రామీణ వైద్యులకు అందినట్టు అనిపిస్తున్నా వారి ఆత్మగౌరవాన్ని నిలబెట్టడం ద్వారా గ్రామీణ వైద్య రంగానికే ఊరట లభించింది.
మరిన్ని వార్తలు: