ఫలితాలు చూసి తీవ్ర అస్వస్టతకి గురయిన కోమటిరెడ్డి…!

Congress MLA Komatireddy Venkat Reddy Unconscious After Defeat In Nalgonda

అసెంబ్లీ ఎన్నికల ఫలితాల తీరు చూసి కాంగ్రెస్ కీలక నేత, మాజీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌ రెడ్డి షాక్‌కు గురయ్యారు. ఫలితాలు వన్‌సైడ్‌గా వస్తుండటంతో సొమ్మసిల్లి పడిపోయారు. బీపీ పెరగడంతో ఆయన ఒక్కసారిగా కింద పడిపోయినట్లు తెలుస్తోంది. ఆయణ్ని వెంటనే జూబ్లీ హిల్స్ అపోలో ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. నల్గొండ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ నుంచి బరిలోకి దిగిన కోమటి రెడ్డి వెంకట్‌రెడ్డి టీఆర్‌ఎస్ అభ్యర్థి కంచర్ల భూపాల్ రెడ్డి చేతిలో ఓటమి పాలయ్యారు. టీఆర్‌ఎస్ అభ్యర్థి కంచర్ల భూపాల్ రెడ్డి 20,504 ఓట్ల మెజార్టీతో కోమటి రెడ్డిపై గెలుపొందారు.

Congress-MLA-Komatireddy

అయితే.. మునుగోడు నుంచి ఆయన సోదరుడు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గెలుపొందడం ఊరటనిచ్చే అంశం. నల్గొండ నియోజకవర్గం నుంచి ఏళ్లుగా గెలుపొందుతున్న కోమటిరెడ్డి వెంకట్ రెడ్డికి ఇది చేదు అనుభవమే. కాంగ్రెస్‌లో కీలక నేతగా ఉన్న ఆయన తన ఓటమిని జీర్ణించుకోలేకపోతున్నారు. గత ఎన్నికల్లో ఆయన 10 వేల పైచిలుకు ఓట్లతో గెలుపొందారు. అయితే గతంలో కంచర్ల భూపాల్ రెడ్డి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి 50 వేల ఓట్లు సాధించడం గమనార్హం. ఈసారి టీఆర్‌ఎస్ తరఫున బరిలోకి దిగడం కంచర్లకు కలిసొచ్చింది. నల్గొండకు మెడికల్ కాలేజీ సాధన, బత్తాయి మార్కెట్ లాంటి అభివృద్ధి కార్యక్రమాలు కంచర్లకు అనుకూలంగా మారినట్లు తెలుస్తోంది.