కేవలం ఐదు నిమిషాల్లో కరోనా నిర్ధారణ పరీక్ష

కేవలం ఐదు నిమిషాల్లో కరోనా నిర్ధారణ పరీక్ష

కేవలం ఐదు నిమిషాల్లో కరోనా వైరస్‌ నిర్ధారణ పరీక్షలు పూర్తిచేసే పరికరాన్ని అభివృద్ధిచేసినట్టు అమెరికాకు చెందిన ఓ సంస్థ శుక్రవారం ప్రకటించింది. అబోట్ ల్యాబొరేటరీస్ రూపొందించిన ఈ పరికరానికి అత్యవసర ప్రక్రియ కింద అమెరికా ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ (ఎఫ్‌డీఏ) అనుమతించింది. వచ్చేవారమే ఈ కిట్ వైద్య సిబ్బందికి అందుబాటులోకి రానుందని అబోట్ తెలిపింది. చిన్నపాటి టోస్టర్ పరిమాణంలో ఉండే మాలిక్యులర్ టెక్నాలజీ పరికరం.. వ్యక్తి నమూనాలను పరీక్షించి.. కరోనా వైరస్ ఉంటే ఫలితం ఐదు నిమిషాల్లోనే వెల్లడిస్తుంది. అంతేకాదు, నెగెటివ్ ఉంటే 13 నిమిషాల్లో ఫలితాన్ని తెలియజేస్తుందని అబోట్ ల్యాబొరేటరీస్ పేర్కొంది.

కోవిడ్-19 మహమ్మారిపై వివిధ రూపాల్లో పోరాటం సాగుతోందని, నిమిషాల వ్యవధిలో ఫలితాలను అందించే పోర్టబుల్ మాలిక్యులర్ పరీక్ష వల్ల మరింత విస్తృతంగా పరిష్కారం లభిస్తుందని అబోట్ ఛైర్మన్ అండ్ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసఱ్ రాబర్ట్ ఫోర్డ్ అన్నారు. ఈ పరికరం చిన్న పరిమాణంలో ఉండటం వల్ల హాస్పిటల్ బయటే దీని సాయంతో పరీక్షలు నిర్వహించవచ్చని ఫోర్డ్ వివరించారు. వైరస్ తీవ్రత ఎక్కువగా ఉన్న ప్రదేశాలకు దీనిని ఉపయోగానికి ఎఫ్‌డీఏతో కలిసి పనిచేస్తామని తెలిపారు.

ఈ పరికరాన్ని ఎఫ్‌డీఏ అమోదించలేదని, కాకపోతే అనుమతి పొందిన ల్యాబ్‌లు, హెల్త్‌కేర్ ప్రొవైడర్ల ద్వారా మాత్రమే అత్యవసర ఉపయోగం కోసం అనుమతించిందని అబోటా తెలిపింది. దక్షిణ కొరియాలోనూ ఏడు నిమిషాల్లోనే కోవిడ్-19 పరీక్ష నిర్వహించే కిట్ తయారు చేశారు. కొరియాలో తొలి కరోనా కేసును జనవరిలో గుర్తించారు. కానీ ఆ కేసు బయటపడక ముందే వుహాన్‌లో కరోనా విజృంభిస్తున్న తీరును గమనించే కొరియా కంపెనీలు టెస్టు కిట్లను డెవలప్ చేయడం మొదలుపెట్టాయి. కొరియాలో కరోనా పేట్రేగే సమయానికి రోజుకు పది వేల మందికిపైగా పరీక్షలు చేసే స్థాయికి ఆ దేశం చేరుకుంది.