మెగాస్టార్ చిరంజీవి హీరోగా దర్శకుడు వశిష్ట దర్శకత్వంలో తెరకెక్కుతున్న భారీ చిత్రం ‘విశ్వంభర’ పై తాజాగా స్పష్టత వచ్చింది. మొదట ఈ సినిమాను జనవరి 2025లో విడుదల చేయాలని భావించినప్పటికీ, పలు కారణాల వల్ల విడుదల తేదీ వాయిదా పడుతూ వస్తోంది. ఈ క్రమంలో సినిమాపై సోషల్ మీడియాలో అనేక రకాల రూమర్లు ప్రచారంలోకి వచ్చాయి.
ఇటీవల ఈ చిత్రం రెండు భాగాలుగా విడుదలవుతుందన్న వార్తలు చక్కర్లు కొట్టాయి. అయితే ఈ ప్రచారానికి దర్శకుడు వశిష్ట ఫుల్ స్టాప్ పెట్టారు. ఆ రూమర్లపై ఆయన వ్యంగ్యంగా స్పందిస్తూ, “ఓహో, నిజమేనా?” అని వ్యాఖ్యానించారు. దీనితో సినిమాను రెండు భాగాలుగా తీస్తున్నారన్న ప్రచారానికి తెరపడినట్లైంది.
ఈ సోషియో ఫాంటసీ చిత్రంలో త్రిష కృష్ణన్ హీరోయిన్గా నటిస్తున్నారు. ‘జగదేకవీరుడు అతిలోకసుందరి’ సినిమాలోని వినోదం, ‘హిట్లర్’ చిత్రంలోని సెంటిమెంట్ టచ్ ఈ సినిమాలో కనిపిస్తాయని సమాచారం. సృష్టి, స్థితి, లయ అనే మూడు భావాల నేపథ్యంలో కథ సాగుతుందని తెలుస్తోంది.
ఈ భారీ చిత్రానికి ఆస్కార్ అవార్డు గ్రహీత కీరవాణి సంగీతం అందిస్తున్నారు. యూవీ క్రియేషన్స్ భారీ బడ్జెట్తో ఈ సినిమాను నిర్మిస్తోంది. అలాగే ఆషిక రంగనాథ్, రమ్య పసుపులేటి, ఇషా చావ్లా, అశ్రిత వేముగంటి నండూరి తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. అభిమానుల అంచనాలను అందుకునేలా ‘విశ్వంభర’ రూపొందుతున్నట్టు చిత్రబృందం స్పష్టం చేస్తోంది.
