వైజాగ్.. దివ్య హత్య కేసు మిస్టరీ వీడింది.. మనీ పంపకాలే కారణం..

ఆంధ్రప్రదేశ్ విశాఖ నగరం నడిబొడ్డున దారుణ హత్యకు గురైన దివ్య హత్య కేసు మిస్టరీని ఎట్టకేలకు పోలీసులు చేధించారు. ముందుగా అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసిన పోలీసులు.. ఆమె ఒంటిపై గాయాలు ఉండటంతో హత్యగా గుర్తించారు. గ్రేటర్ విశాఖ నగరంలో రెండు రోజుల క్రితం అక్కయ్యపాలెం చెక్కుడురాయి బిల్డింగ్‌ వద్ద అనుమానాస్పద స్థితిలో మృతిచెందిన దివ్య కేసులో సంచలన నిజాలు వెలుగు చూశాయి.

అవేమంటే.. దివ్యతో కలిసి వ్యభిచారం నిర్వహిస్తున్న ఓ ముఠాయే ఆమెను అత్యంత దారుణంగా హతమార్చినట్లు పోలీసు విచారణలో తేలింది. దివ్యతో వ్యభిచారం చేయిస్తూ డబ్బులు సంపాదించాలని వివాహిత వసంత, ఆమె సోదరి ప్లాన్ చేశారు. కానీ..  దివ్యను పెట్టుబడిగా పెట్టి వసంత గ్యాంగ్ డబ్బులు సంపాదిస్తోంది. దీంతో డబ్బుల పంపకం విషయంలో దివ్య, వసంత గ్యాంగ్‌కు మధ్య గొడవవలు వచ్చాయి. దీంతో దివ్యను చంపేయాలని వసంత గ్యాంగ్ స్కెచ్ వేసింది. అందులో భాగంగా దివ్యకు గుండు గీసి.. కనుబొమ్మలు కత్తిరించి, వాతలు పెట్టి చిత్రహింసలకు గురిచేశారు. దివ్య ఒంటిపై సిగరెట్ వాతలు కూడా ఉన్నట్లు పోలీసులు తేల్చేశారు. ఇలా మూడు రోజులుగా తిండి కూడా పెట్టకుండా గదిలో వేసి దివ్యను బంధించారు. టార్చర్ పెట్టిన తర్వాత ఆమె ప్రాణాలు తీసేశారు.

కాగా ఈ కేసును సీరియస్‌గా తీసుకున్న పోలీసులు.. రెండో రోజుల్లోనే మిస్టరీని ఛేదించారు. ఈ కేసులో మొత్తం నలుగురిని అనుమానితులుగా గుర్తించారు. ప్రధాన నిందితులు వసంత, ఆమె సోదరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆ తర్వాత రంగంలోకి దిగిన పోలీసులు దివ్య సొంతూరును తూర్పు గోదావరి జిల్లాగా గుర్తించారు. కాగా దివ్యను అంతలా గాయపరిచి.. హత్యకు ఉపయోగించినట్లు అనుమానిస్తున్న సామగ్రిని, పరికరాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.