చైతూ, సామ్‌ రొమాన్స్‌కు సీక్వెల్‌

gautham menon planning on ye maya chesave sequel

Posted [relativedate] at [relativetime time_format=”H:i”]

నాగచైతన్య, సమంతల కలయికలో 2010వ సంవత్సరంలో ప్రేక్షకుల ముందుకు వచ్చిన చిత్రం ‘ఏమాయ చేశావే’. సమంతకు ఆ సినిమా మొదటి సినిమా, నాగచైతన్యకు కూడా దాదాపుగా మొదటి సినిమాగానే భావించవచ్చు. ఆ సినిమా వీరిద్దరి కెరీర్‌ను మలుపు తిప్పింది. ముఖ్యంగా సమంతకు స్టార్‌డంను తెచ్చి పెట్టింది. ఒక్క సినిమాతో స్టార్‌ అవ్వడం చాలా రేర్‌. కాని సమంత ‘ఏమాయ చేశావే’ చిత్రంతో స్టార్‌ అయ్యింది. ఆ సినిమా వీరిద్దరికి కూడా చాలా ప్రత్యేకం. ఆ విషయాన్ని ఇద్దరు పలు ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు. వారి ప్రేమ పుట్టడానికి కూడా కారణం ఆ సినిమానే అని చెప్పుకోవచ్చు. అలాంటి సినిమాకు సీక్వెల్‌ చేయబోతున్నారు. తమిళంలో ఈ చిత్రాన్ని గౌతమ్‌ వాసుదేవ్‌ మీనన్‌ దర్శకత్వంలో తెరకెక్కించడం జరిగింది.

తమిళంలో శింబు మరియు త్రిషలు జంటగా నటించగా, తెలుగులో నాగచైతన్య మరియు సమంతలు జంటగా నటించారు. తమిళంలో కంటే తెలుగులో బ్లాక్‌ బస్టర్‌ సక్సెస్‌ అయ్యింది. ఆ సినిమాకు దర్శకుడు గౌతమ్‌ వాసు దేవ్‌ మీనన్‌ సీక్వెల్‌ చేసేందుకు స్క్రిప్ట్‌ను రెడీ చేస్తున్నాడు. ఇప్పటికే తమిళ హీరో శింబును కలవడం, స్టోరీ లైన్‌ను చెప్పడం జరిగింది. త్వరలోనే నాగచైతన్యను కూడా దర్శకుడు గౌతమ్‌ మీనన్‌ కలుస్తాడనే సమాచారం అందుతుంది. భారీ ఎత్తున అంచనాలున్న సీక్వెల్‌లో వీరిద్దరు కలిసి నటిస్తే సినిమా స్థాయి అమాంతం పెరిగి పోవడం ఖాయం. అయితే నాగచైతన్య, సమంత ఇద్దరు ఈ చిత్రానికి ఓకే చెబుతారా లేదా అనేది ప్రస్తుతం అందరిలో ఉన్న ప్రశ్న. ఇప్పటి వరకు చైతూ వద్దకు ఈ ప్రపోజల్‌తో వెళ్లలేదు అని, ఒకవేళ ఆయన నో అంటే తాను సినిమాను తెలుగులో చేయక పోవచ్చు అంటూ దర్శకుడు గౌతమ్‌ మీనన్‌ చెప్పుకొచ్చాడు. మరి చైతూ ఏమంటాడో తెలియాలి అంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే.