తెల్లారే సరికి శవమై కనిపించిన కుమార్తె

తెల్లారే సరికి శవమై కనిపించిన కుమార్తె

తండ్రి మందలించాడని కుమార్తె ఆత్మహత్య చేసుకుంది. ఈ సంఘటన మండలంలోని బొట్లగూడూరు గ్రామ పంచాయతీ పరిధిలోని కొత్తపల్లె గ్రామంలో ఆదివారం ఉదయం వెలుగుచూసింది. వివరాల్లోకి వెళితే..గ్రామానికి చెందిన చీమలదిన్నె మాధవరావు, పద్మలు కిరాణాదుకాణం నిర్వహిస్తూ పిల్లలను చదివిస్తున్నారు. కుమార్తె దేవీ ప్రసన్న(20) ఒంగోలులో అగ్రికల్చల్‌ బీఎస్సీ, కుమారుడు విజయవాడలో ఇంటర్మీడియెట్‌ చదివిస్తున్నారు.

ఇటీవల లాక్‌డౌన్‌తో ఇద్దరూ ఇంటికి వచ్చారు. ఈ క్రమంలో శనివారం రాత్రి 8 గంటల సమయంలో టీవీ చూస్తున్న ప్రసన్నను తండ్రి మాధవరావు మందలించాడు. త్వరలో ఉద్యోగాల నోటిఫికేషన్‌ ఉందని, చదువుకొని మంచి ఉద్యోగం సాధించాలని చెప్పాడు. అనంతరం ఎప్పటిలాగే రాత్రి భోజనం చేసి నిద్రపోయారు. దేవీ ప్రసన్న వరండాలో నిద్రపోగా మిగిలిన వారంతా పంచలో పడుకున్నారు. ఆదివారం తెల్లవారుజామున 5 గంటల సమయంలో పద్మ నిద్ర లేచి ఇంట్లోకి వెళ్లగా కుమార్తె ప్రసన్న ఉరేసుకొని వేలాడుతూ కనిపించడంతో కేకలు వేసింది.

దీంతో కుటుంబసభ్యులు ఆమెను కింద దించగా అప్పటికే మృతి చెందింది. దీంతో ఒక్కసారిగా కుటుంబంలో విషాదఛాయలు అలుముకున్నాయి. సమాచారం అందుకున్న ఎస్సై అంబటి చంద్రశేఖర్, ఏఎస్సై డి.లక్ష్మీప్రసాద్‌లు సంఘటనా స్థలానికి చేరుకుని మృతురాలి తల్లి ఇచ్చిన ఫిర్యాదుమేరకు కేసునమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కనిగిరి వైద్యశాలకు తరలించారు.