జీవీఎల్ మీద చెప్పు….బినామీల గోల ?

బీజేపీ అధికార ప్రతినిధి, రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ కు చేదు అనుభవం ఎదురయింది. ఢిల్లీలోని బీజేపీ కేంద్ర కార్యాలయంలో జీవీఎల్ ఈరోజు మీడియా సమావేశం నిర్వహిస్తుండగా జీవీఎల్ మీద ఓ వ్యక్తి చెప్పును విసిరాడు. వెంటనే అప్రమత్తమైన బీజేపీ కార్యకర్తలు, పోలీసులు సదరు వ్యక్తిని అదుపులోకి తీసుకుని బయటకు లాక్కెళ్లారు. కాగా, జీవీఎల్ పై చెప్పు విసిరిన వ్యక్తిని యూపీలోని కాన్పూర్ కు చెందిన శక్తి భార్గవగా పోలీసులు గుర్తించారు. ఇతడిని పోలీసులు ఢిల్లీలోని కమలానగర్ పోలీస్ స్టేషన్ కు తరలించి విచారిస్తున్నారు. ఈయన కాన్పూర్ లో భార్గవ హాస్పిటల్ ను నడుపుతున్నాడని అన్నారు. మూడు ఖరీదైన బంగ్లాలను కొనుగోలు చేసిన విషయంలో ఐటీ అధికారులు 2018లో భార్గవకు చెందిన ఆసుపత్రిపై దాడులు నిర్వహించారని పోలీసులు వెల్లడించారు. ఈ సందర్భంగా నిర్వహించిన సోదాల్లో అధికారులు రూ.50 లక్షల విలువైన నగలతో పాటు రూ.28 లక్షల నగదును స్వాధీనం చేసుకున్నారని పేర్కొన్నారు. ఈ మూడు ఖరీదైన భవంతులను శక్తి భార్గవ రూ.11.50 కోట్లు వెచ్చించి కొన్నారనీ, అయితే ఇందుకు అవసరమైన డబ్బులు ఎక్కడి నుంచి వచ్చాయో ఆయన చెప్పలేదని అన్నారు. అంతేకాకుండా ఈ మూడు భవంతులను భార్య, పిల్లల పేరుపై ఆయన రిజిస్టర్ చేయించారని దీంతో ఈ వ్యవహారంపై ఇటీవల కేంద్రం తీసుకొచ్చిన బినామీ చట్టం కింద విచారణ సాగుతోందని అన్నారు. ఈ నేపథ్యంలో కేంద్రం ప్రభుత్వ తీరుపై మనస్తాపం చెందిన భార్గవ తన నిరసనను తెలియజేసేందుకే అధికార పార్టీ నేత అయిన జీవీఎల్ పై చెప్పును విసిరాడని వ్యాఖ్యానించారు.