లాక్ డౌన్ అవకాశంగా… సైబర్ వల.. గంటల్లోనే లక్షలు ఎత్తేశారు..

లాక్ డౌన్ ను అవకాశంగా మలుచుకొని కొంతమంది సైబర్ కేటుగాళ్లు రెచ్చిపోతున్నారు. హైదరాబాద్‌లో సైబర్ నేరగాళ్లు మరీ విచ్చలవిడిగా దోపిడీలు చేస్తున్నారు. కొద్దిగంటల వ్యవధిలోనే పలువురి నుంచి ఏకంగా రూ.4.75లక్షలు కొట్టేసి షాక్ కు గురి చేస్తున్నారు. దీంతో బాధితులు సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించారు.

అయితే అసలు ఏం జరిగిందంటే… బ్యాంక్ అధికారులు, సోషల్ నెట్‌వర్క్ ప్రతినిధులమని నటిస్తూ.. కొందరికి ఫోన్లు చేస్తూ బ్యాంక్ అకౌంట్లలో డబ్బులు మాయం చేస్తున్నారు. తాజాగా హైదరాబాద్‌ లో కేవలం కొద్ది గంటల్లోనే పలువురి నుంచి ఏకంగా రూ.4.75 లక్షల నగదు దోచుకున్నారు. దీనిపై ఆది, సోమవారాల్లో బాధితులు సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఖైరతాబాద్‌లో నివసించే ఉదయ్ రక్షక్‌కు సోమవారం ఓ ఫోన్ కాల్ వచ్చింది. ఫ్యాన్సీ ఫోన్‌ నంబర్లు ఇస్తామంటూ.. చెప్పిన అవతలి వ్యక్తి రూ.2వేలు ఆన్‌లైన్ ట్రాన్స్‌ఫర్ చేయాలని కోరాడు. అతడు చెప్పినట్టే ఉదయ్ మనీ ట్రాన్స్‌ఫర్ చేశాడు. వెంటనే ఆ అకౌంట్‌ను హ్యాక్ చేసి రూ.55వేలు దోచుకున్నారు. అలాగే… కుందన్‌బాగ్‌లో నివాసముంటున్న ఆర్మీ మాజీ ఉద్యోగి శ్రీనివాసరెడ్డి పేటీఎం ఖాతా బ్లాక్ అయిందంటూ కేటుగాళ్లు ఫోన్‌ చేసి వివరాలు రాబట్టారు. వాటి ఆధారంగా రూ.1.85 లక్షల నగదు దోచుకున్నారు.

అంతేకాకుండా ఎస్సార్‌ నగర్‌కు చెందిన హరీష్‌ రాజా అనే వ్యాపారికి సైబర్ నేరగాళ్లు ఫోన్‌ చేసి పేటీఎం ఖాతాను అప్‌డేట్‌ చేయాలంటూ వివరాలు తీసుకొని….ఆ వెంటనే ఆయన బ్యాంక్ అకౌంట్‌ నుంచి రూ.1.32లక్షలు మాయమయ్యాయి. అదేవిధంగా.. సికింద్రాబాద్‌లో ఉంటున్న కాశీనాథ్‌కు రెండు బ్యాంక్ అకౌంట్లు ఉన్నాయి. కేవైసీని అప్‌డేట్ చేయకపోతే నెట్ బ్యాంకింగ్ బ్లాక్ చేస్తామని నమ్మించి ఏకంగా రూ.1.03 లక్షలు కొట్టేశారు. అంతటితో ఆగకుండా అంబర్‌పేటకు చెందిన మొయీన్‌ తక్కువ ధరకే కారు విక్రయిస్తామంటూ ఆన్‌లైన్ ప్రకటన చూసి ఫోన్ చేశాడు. అవతలి వ్యక్తి రెండు గంటల్లోనే కారు పంపిస్తామంటూ.. రూ.60వేలు ట్రాన్స్‌ఫర్ చేయించుకున్నారు. ఆ తర్వాత ఫోన్ స్విచ్ఛాఫ్ చేసుకోవడంతో బాధితుడు పోలీసులను ఆశ్రయించాల్సి వచ్చింది. ఇదంతా పోలీసుల ఫిర్యాదు మేరకు తెలిసిన విషయాలు. మొత్తానికి లాక్ డౌన్ ను ఆసరాగా చేసుకొని.. ఇదో అవకాశంగా మలుచుకొని కేటుగాళ్లు సైబర్ మోసాలకు పాల్పడుతుండటం అందరినీ షాక్ కు గురిచేస్తుంది.