ఎకానమీ కంటే జీవితం గొప్పది… మే 3వరకు లాక్ డౌన్ లోనే దేశం…

అందరూ ఎదురు చూస్తున్నట్లుగా సరిగ్గా 10 గంటలకు ప్రధాని మోడీ భారత ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు. దేశ ప్రజలంతా ఎంతో ఉత్కంఠతో ఎదురు చూస్తున్న ఈ సమయంలో మరో 19రోజుల పాటు లాక్ డౌన్ కొనసాగింపు తప్పదని మోడీ స్పష్టం చేశారు. మే 3వ తేదీ వరకు ఇలాంటి లాక్ డౌన్ యథావిథిగా కొనసాగింపు ఇవ్వాలని ఆయన దేశ ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

భారత్ లో కరోనా వైరస్ మహమ్మారిని ఎదుర్కోవడంలో ప్రజలది కీలక పాత్ర అని.. సహకరిస్తున్న అందరికీ కృతజ్ఞతలు తెలిపారు. కరోనాపై పోరాడేందుకు ప్రతి ఒక్కరూ సహకరిస్తున్నారని… ఎన్నో త్యాగాలు చేస్తున్నారని మోడీ అన్నారు. కరోనాను తరమడంలో ప్రపంచ దేశాలతో పోలిస్తే భారత్ పోరాటం లాభదాయకంగా ఉంది. చాలా మార్గదర్శకంగా కూడా ఉందని ప్రశంసలు అందుతున్నాయని అన్నారు.

ప్రజలంతా తినడానికి, ప్రయాణాలకు చాలా ఇబ్బందులు పడుతున్నారు కానీ.. ఇలాంటి విజయంలో ప్రజలే కీలక పాత్ర వహించారని మోడీ వివరించారు. ఐకమత్యంతో అంబేద్కర్ జయంతి వేళ.. ఆయనకిదే నిజమైన నివాళి అని.. ఇంట్లో ఉండే పండుగలు చేసుకుందామని మోడీ వివరించారు. ఇదే సమయంలో వచ్చిన పండుగలను ప్రజలంతా చాలా సంయమనంతో జరుపుకున్నారని.. లాక్ డౌన్ కు సహకరించిన ప్రజలకు మద్దతుగా నిలిచిన అందరికీ కృతజ్ఞతలు తెలిపారు ప్రధానమంత్రి మోడీ.

అంతేకాకుండా ఎకానమీకంటే జీవితం గొప్పదని, దేశమొత్తం మీద పదివేలు కేసులుంటే మూడు వందలమంది చనిపోయారని మోడీ వివరించారు. నిజంగా ప్రజల కృషి వల్లనే కరోనా నియంత్రణలో ఉందని మోడీ వివరించారు. భౌతికదూరం అనేది దేశానికి చాలా బాగా ఉపయోగపడిందని మోడీ వివరించారు.