Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
అతిలోక సుందరి శ్రీదేవి మరణించి మూడు నెలలు గడుస్తున్నాయి. శ్రీదేవి చనిపోయిందని తెలియగానే అందరికీ గుర్తొచ్చింది ఆమె ఇద్దరు పిల్లలు జాన్వీ, ఖుషి కపూర్ లు. పిల్లలను ఎంతో అపురూపంగా పెంచి పెద్ద చేసిన శ్రీదేవి..వారికి అన్నింటా తోడుగా నిలిచింది. జాన్వి, ఖుషిలు ఎప్పుడూ తల్లిచాటు పిల్లలుగానే ఉండేవారు. అలాంటిది శ్రీదేవి హఠాన్మరణం తర్వాత వారి పరిస్థితి ఎలా ఉంటుంది అని అందరికీ సందేహం కలిగింది. శ్రీదేవి మరణం చుట్టూ చెలరేగిన వివాదం కూడా జాన్ని, ఖుషిల భవిష్యత్ పై అనేక ప్రశ్నలు లేవనెత్తింది.
శ్రీదేవి దుబాయ్ లో ఆకస్మికంగా మరణించడం వెనక బోనీ హస్తం ఉందని వచ్చిన ఆరోపణలు జాన్వీ, ఖుషీపై తీవ్ర ప్రభావం చూపుతుందని అంతా భావించారు. అయితే ఇలాంటి ప్రచారాలేమీ శ్రీదేవి కూతుళ్లిద్దరూ నమ్మలేదు. జాన్వి అయితే తన తల్లిదండ్రుల ప్రేమబంధాన్ని అపహాస్యం చేయకండి అంటూ బహిరంగంగా ఓ లేఖ కూడా రాసింది. శ్రీదేవి మరణంతో తాము తల్లిని మాత్రమే కోల్పోయామని, తన తండ్రి సర్వస్వాన్ని కోల్పోయారని చెప్పిన జాన్వి తండ్రిపై ఎంతో నమ్మకం కనబర్చింది. శ్రీదేవి మరణం తర్వాత పిల్లలిద్దరూ తండ్రికి మరింత దగ్గరయ్యారు.
తల్లి చనిపోవడంతో ఒంటరివాళ్లమన్న భావన కలగనీకుండా బోనీకపూర్ జాన్వి, ఖుషీలిద్దరినీ మొదటి భార్య పిల్లలు అర్జున్ కపూర్, అన్షులాకు దగ్గర చేశారు. బోనీ కుటుంబం మొత్తం ఇప్పుడు కలిసిమెలిసి ఉంటోంది. శ్రీదేవి చనిపోయిన తర్వాత తాను జాన్వి, ఖుషీలకు తండ్రిగానే కాకుండా తల్లి పాత్ర కూడా పోషిస్తున్నానంటున్నారు బోనీ కపూర్. పిల్లల బాధ్యత గురించి ఆయన ఓ ఇంగ్లిష్ మీడియాతో మాట్లాడారు. ఒక్కసారిగా శ్రీదేవి తమకు దూరమైందని, ఈ రెండు, మూడు నెలలు చాలా క్లిష్టంగా గడిచాయని, తమ జీవితాలు ఒక్కసారిగా ఎక్కడికక్కడ నిలిచిపోయినట్టు ఉందని బోనీ ఆవేదన వ్యక్తంచేశారు.
శ్రీదేవి ఇంకా చాలా పనులు చేయాల్సి ఉందని, ఆమె మరణంతో ముక్కలైన తన జీవితాన్ని పిల్లల కోసం బాగుచేసుకుంటున్నానని చెప్పుకొచ్చారు. కొన్ని నిర్ణయాలు ఎక్కడికక్కడ ఆగిపోయాయని, శ్రీదేవి తిరిగి రాని లోకాలకు వెళ్లిపోయిందన్న నిజాన్ని ఇప్పటికీ జీర్ణించుకోలేకపోతున్నానని తెలిపారు. ప్రపంచానికి శ్రీదేవి చాందిని కావొచ్చు కానీ తనకు మాత్రం ఓ స్నేహితురాలని, తన ప్రాణమని చెప్పారు. తన ఇద్దరు కూతుళ్లకు వారి తల్లే ప్రపంచమని గుర్తుచేసుకున్నారు. ఇప్పుడు తాను వారికి తండ్రిగానే కాకుండా తల్లిగానూ వ్యవహరిస్తూ అన్నీ దగ్గరుండి చూసుకుంటున్నానని తెలిపారు బోనీ.