గత వారం థియేటర్లలో విడుదలై సెన్సేషనల్ విజయాన్ని అందుకున్న తెలుగు చిత్రం ‘ఇరుముడి’ Irumudi. మాస్ మహారాజ రవితేజ హీరోగా నటించిన ఈ సినిమా అంచనాలను మించి వసూళ్లు సాధిస్తూ ఆయనకు మంచి కంబ్యాక్ మూవీగా నిలిచింది. సినిమా విజయంతో రవితేజ అభిమానుల్లోనే కాకుండా సినీ వర్గాల్లోనూ జోష్ నెలకొంది.
ఇక ‘ఇరుముడి’కి ప్రేక్షకుల నుంచి వస్తున్న స్పందనతో పాటు పలువురు సినీ ప్రముఖులు కూడా చిత్ర యూనిట్పై ప్రశంసలు కురిపిస్తున్నారు. ఇప్పటికే నేషనల్ క్రష్ రష్మిక మందన్నా ఈ సినిమాపై తన స్పందనను తెలియజేయగా, తాజాగా మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్గా మారాయి.
‘ఇరుముడి’ ఘన విజయం సాధించిన సందర్భంగా రవితేజతో పాటు చిత్ర యూనిట్ మొత్తానికి రామ్ చరణ్ శుభాకాంక్షలు తెలిపారు. సినిమాకు ప్రేక్షకుల నుంచి లభిస్తున్న ప్రేమ, స్పందనను చూసి ఎంతో సంతోషంగా ఉందని పేర్కొన్నారు.
అంతేకాకుండా రవితేజతో పాటు చిత్ర బృందం మొత్తం ఈ విజయానికి, తాము చేసిన కష్టానికి అన్ని ప్రశంసలకు అర్హులని రామ్ చరణ్ కొనియాడారు. చివర్లో తన ఇష్టదైవం అయ్యప్ప స్వామిని స్మరిస్తూ ‘స్వామి శరణం’ అంటూ తన స్పందనను ముగించడం ప్రత్యేక ఆకర్షణగా మారింది.
ఇదిలా ఉంటే ‘ఇరుముడి’లో రామ్ చరణ్ కూడా కనిపించబోతున్నాడనే రూమర్స్ గతంలో సోషల్ మీడియాలో వైరల్ అయిన సంగతి తెలిసిందే. అయితే ఆ ప్రచారానికి ఎలాంటి అధికారిక క్లారిటీ రాలేదు. ప్రస్తుతం మాత్రం రామ్ చరణ్ స్వయంగా ‘ఇరుముడి’ విజయంపై స్పందించడం మెగా అభిమానుల్లో ఆసక్తిని పెంచుతోంది.






