ఇండియన్ సినిమా నుంచి తెరకెక్కుతున్న మోస్ట్ అవైటెడ్ పాన్ ఇండియా చిత్రాల్లో ‘రామాయణ’ Ramayana కూడా ఒకటి. నితీష్ తివారి దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాలో రణబీర్ కపూర్, సాయి పల్లవి, యష్ వంటి ప్రముఖ తారలు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. భారీ అంచనాల మధ్య తెరకెక్కుతున్న ఈ సినిమా నుంచి తాజాగా ఫస్ట్ సింగిల్తో పాటు కొత్త పోస్టర్ను మేకర్స్ విడుదల చేశారు.
అయితే పాట విడుదలైన వెంటనే సోషల్ మీడియాలో దీనిపై భిన్నమైన స్పందనలు వ్యక్తమవుతున్నాయి. ముఖ్యంగా పాటలో శ్రీకృష్ణుడి ప్రస్తావన రావడంపై కొందరు నెటిజన్లు ప్రశ్నలు, విమర్శలు చేస్తున్నారు. రామాయణ కాలానికి సంబంధించిన కథలో కృష్ణుడి పేరు ప్రస్తావించడంపై పలువురు సందేహాలు వ్యక్తం చేస్తున్నారు.
రాముడి అవతారం అనంతరం శ్రీకృష్ణుడి అవతారం వచ్చిందనే విషయాన్ని ప్రస్తావిస్తూ, రామాయణ కథలో ముందుగానే కృష్ణుడి పేరు ఎలా వచ్చిందని కొందరు ప్రశ్నిస్తున్నారు. పాట సాహిత్యంలో ఇలాంటి అంశాలను చేర్చే ముందు మేకర్స్ తగినంత గ్రౌండ్ వర్క్ చేశారా అంటూ సోషల్ మీడియాలో కామెంట్లు కనిపిస్తున్నాయి.
అయితే ఈ ప్రస్తావన వెనుక చిత్రబృందం ఉద్దేశం ఏమిటి? అది కేవలం సాహిత్యపరమైన ప్రయోగమా, లేక కథకు సంబంధించిన మరో సందర్భమా అనేది సినిమా విడుదలైతేనే స్పష్టత వచ్చే అవకాశం ఉంది. ప్రస్తుతం మాత్రం ఈ అంశం సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది.
మరి ఈ విమర్శలపై ‘రామాయణ’ చిత్రబృందం స్పందిస్తుందా? పాటలో కృష్ణుడి ప్రస్తావనకు ఏదైనా వివరణ ఇస్తారా? అనేది ఆసక్తికరంగా మారింది. ఇక ఈ భారీ చిత్రానికి ఏ.ఆర్. రెహమాన్ సంగీతం అందిస్తున్నారు. నమిత్ మల్హోత్రా, యష్ కలిసి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.





