Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
రాజకీయాల్లో హత్యలుండవు. ఆత్మహత్యలు తప్ప అన్న ఓ రాజనీతిజ్ఞుడు మాటలను అక్షరాలా నిజం చేస్తున్నారు వైసీపీ అధినేత జగన్. పోలవరం విషయంలో ఆయన చేస్తున్న కామెంట్స్ చూస్తుంటే వైసీపీ నేతలే కంగుతింటున్నారు. పోలవరం నిర్మాణ పనులకు సంబంధించి స్పిల్ వే , స్పిల్ ఛానల్ టెండర్లు ఆపాలని కేంద్ర జలవనరుల శాఖ ఆదేశాల మీద సీఎం చంద్రబాబు ఫైర్ అయితే ఇన్నాళ్లు కేంద్రాన్ని ఎందుకు వెనుకేసుకొచ్చావని సీఎం మీద మండిపడాల్సిన జగన్ రివర్స్ లో వచ్చారు. ఇక పోలవరం పనులు ఆపినందుకు కేంద్రాన్ని కించిత్ మాట అనకుండా వెనుకేసుకొచ్చారు. చంద్రబాబు పోలవరం నిర్మాణం విలువ పెంచడం వల్లే కేంద్రం కూడా భయపడుతోందంటూ జగన్ వ్యాఖ్యానించారు. ఆంధ్రప్రజలు ఎన్నో ఆశలు పెట్టుకున్న పోలవరం మీద జగన్ కామెంట్స్ వైసీపీ కి ఆత్మహత్య సదృశ్యం అని ఆ పార్టీకే చెందిన సీనియర్ నాయకుడు వాపోయారు. జగన్ కామెంట్స్ తర్వాత ఏ మొహం పెట్టుకుని జనం వద్దకు వెళ్లాలని ఆయన ఆవేదన చెందారు. జగన్ ఇలా అనడం వెనుక పెద్ద లక్ష్యమే ఉండొచ్చు.
నిజానికి ఇప్పుడు కేంద్రం వ్యవహరిస్తున్న తీరుతో సాక్షాత్తు రాష్ట్ర బీజేపీ నేతలే గట్టిగా నోరు తెరవలేని పరిస్థితి. అలాంటిది జగన్ తప్పు చంద్రబాబుది తప్ప కేంద్రానిది కాదన్నట్టు మాట్లాడడం వెనుక రాజకీయ కోణం కనిపిస్తోంది. తాజా సర్వే ఫలితాలతో 2019 ఎన్నికల్లో వైసీపీ గెలుపు కష్టమని జగన్ ఓ నిర్దారణకు వచ్చారట. అయితే బీజేపీ తో పొత్తు కుదిరితే మాత్రం ప్రస్తుతం వున్న కేసుల నుంచి బయట పడొచ్చని అనుకుంటున్నారట. బీజేపీ తో పొత్తు వల్ల ఏపీ లో అపజయం ఎదురు అయినప్పటికీ కేంద్రంలో మళ్లీ మోడీ ప్రభుత్వమే వస్తుందన్న అంచనాతో జగన్ ఈ వ్యూహానికి పదును పెడుతున్నట్టు కనిపిస్తోంది. ఓ విధంగా చెప్పాలంటే తాను సీఎం కాకపోయినా మోడీ పీఎం అయితే చాలు అన్నట్టుంది జగన్ ధోరణి.
కేసుల ఊబి నుంచి బయటపడడం అనే ఆశతో జగన్ చేస్తున్న ఈ రాజకీయ తప్పిదానికి భవిష్యత్ లో భారీ మూల్యం చెల్లించే పరిస్థితి రావొచ్చు. మోడీ, అమిత్ షా లు ప్రస్తుతం మిత్రపక్షాలతో వ్యవహరిస్తున్న తీరు, వారి రాజకీయ దూకుడు చూస్తే జగన్ కి తాను ఏ తప్పు చేస్తున్నాడో తేలిగ్గా అర్ధం అవుతుంది. 2014 ఎన్నికల్లో బీజేపీ తో కలిసి పని చేసిన టీడీపీ , శివసేన ఇప్పుడు బీజేపీ తో ఎలా వుంటున్నాయో గమనించవచ్చు . ఇక మోడీ ఆ మిత్రపక్షాలను ఎంతగా హర్ట్ చేస్తున్నారో జనం చూస్తూనే వున్నారు. ఇక తమిళ రాజకీయాల్లో అన్నాడీఎంకే ని లొంగదీసుకోడానికి సర్వశక్తులు ప్రయోగించి చివరకు కరుణానిధి ఇంటికెళ్లి పరామర్శకు దిగిన మోడీ తనను కేసుల నుంచి బయట పడేస్తాడని నమ్మడమే రాజకీయంగా జగన్ అమాయకత్వం. ఇక్కడ విలువలకు, ఇచ్చిన మాటలకు స్థానం ఉండదు. గెలుపుకు మాత్రమే విలువ. 2019 ఎన్నికల్లో టీడీపీ గెలిచి ఆయన అవసరం పడితే మోడీ నాలుగు కాదు నలభై మెట్లు దిగొస్తారు. ఈ మర్మం తెలియకుండా తాను ఓడినా మోడీ గెలిస్తే చాలనుకునే జగన్ అమాయకత్వం మీద జాలి పడడం తప్ప ఏమి చేయగలం ?