కడప కోర్టు ఉత్తర్వులు: ఇకపై ప్రచారాల్లో వైఎస్ వివేకా హత్యా ప్రస్తావన రాకూడదు

ఎన్నికల వేళ వివేకానంద రెడ్డి హత్య కేసు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో సంచలనం రేపుతోంది. ఏపీపీసీసీ అధినేత్రి షర్మిల, సునీత, చంద్రబాబు, పవన్ కళ్యాణ్, ఇతర ప్రతిపక్ష నేతలు అధికార పక్షంపై తీవ్ర ఆరోపణలు చేస్తూ వైఎస్ హత్యకు వైసీపీ నేతలే కారణమన్నారు. మరీ ముఖ్యంగా వైఎస్ షర్మిల, వైఎస్ సునీతలు వివేకా హత్యకు కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డినేనని ఆరోపిస్తున్నారు. దీంతో వివేకా హత్య కేసులో ఇరువర్గాల మధ్య డైలాగ్ వార్ నడుస్తోంది. ఈ క్రమంలో సురేష్ బాబు పిటిషన్‌పై గురువారం విచారణ జరిపిన కడప కోర్టు.. విపక్ష నేతలకు కీలక ఆదేశాలు జారీ చేసింది.

ఇక నుంచి వైఎస్ వివేకానంద రెడ్డి హత్యపై ఎవరూ మాట్లాడొద్దని కడప కోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్, ఆంధ్రప్రదేశ్ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల, ఏపీ బీజేపీ అధ్యక్షురాలు పురందేశ్వరి, తెలుగు దేశం జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్, వైఎస్ వివేకానంద రెడ్డి కుమార్తె వైఎస్ సునీతలను కడప కోర్టు ఆదేశించింది.