Kamal Haasan: ప్రజల తీర్పును తక్కువ చేయొద్దు.. విజయ్‌కు ప్రభుత్వం ఏర్పాటు చేసే అవకాశం ఇవ్వాలి

Kamal Haasan: ప్రజల తీర్పును తక్కువ చేయొద్దు.. విజయ్‌కు ప్రభుత్వం ఏర్పాటు చేసే అవకాశం ఇవ్వాలి
Kamal Haasan: ప్రజల తీర్పును తక్కువ చేయొద్దు.. విజయ్‌కు ప్రభుత్వం ఏర్పాటు చేసే అవకాశం ఇవ్వాలి

తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు రాష్ట్ర రాజకీయాలను ఉత్కంఠతో నింపాయి. ఎప్పుడూ లేనంతగా ఏ ఒక్క పార్టీకి స్పష్టమైన మెజార్టీ రాకపోవడంతో తదుపరి ప్రభుత్వం ఎవరిది అన్న ప్రశ్నపై తీవ్ర చర్చ నడుస్తోంది. ఈ కీలక ఘట్టంలో కమల్ హాసన్ చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారాయి.

ఎన్నికల్లో 108 స్థానాలు సాధించి అతిపెద్ద పార్టీగా నిలిచిన తమిళగ వెట్రి కళగం (TVK) అధినేత విజయ్ ను వెంటనే ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాలని కమల్ హాసన్ స్పష్టం చేశారు. విజయ్‌కు ఆ అవకాశం ఇవ్వకపోతే అది తమిళనాడు ప్రజల తీర్పును అవమానించినట్లేనని ఆయన వ్యాఖ్యానించారు. ఇంకా ఎమ్మెల్యేల ప్రమాణ స్వీకారం కూడా జరగకుండానే ఆలస్యం చేయడం రాష్ట్రానికి, ప్రజాస్వామ్యానికి మంచిది కాదని ఆందోళన వ్యక్తం చేశారు.

ఇక మరోవైపు, బాధ్యతాయుతమైన ప్రతిపక్ష పాత్ర పోషిస్తామని డీఎంకే అధినేత ఎంకే స్టాలిన్ ప్రకటించడాన్ని కమల్ స్వాగతించారు. ప్రజల నిర్ణయాన్ని గౌరవిస్తూ స్టాలిన్ తీసుకున్న ఈ వైఖరి ఆయన రాజకీయ పరిణతిని ప్రతిబింబిస్తోందని ప్రశంసించారు. ఇదే సమయంలో గవర్నర్ పాత్రపై పరోక్షంగా కీలక వ్యాఖ్యలు చేస్తూ, రాజ్యాంగ పదవుల్లో ఉన్నవారు తమ బాధ్యతను సక్రమంగా నిర్వర్తించాల్సిన అవసరం ఉందని గుర్తు చేశారు. ఇది తన డిమాండ్ కాదని, రాజ్యాంగం అప్పగించిన విధిని మాత్రమే గుర్తుచేస్తున్నానని తేల్చి చెప్పారు.

ప్రభుత్వ ఏర్పాటు సమయంలో తలెత్తే న్యాయపరమైన అంశాలపై మాట్లాడిన కమల్ హాసన్, ప్రఖ్యాత ‘ఎస్.ఆర్. బొమ్మై’ కేసును ప్రస్తావించారు. ఏ పార్టీకి స్పష్టమైన మెజార్టీ లేని పరిస్థితిలో బలపరీక్ష అనేది రాజ్‌భవన్‌లో కాదు, అసెంబ్లీలోనే జరగాలన్న సుప్రీంకోర్టు తీర్పును గుర్తు చేశారు. తాను పార్టీ నేతగా కాదు, రాజ్యాంగంపై అవగాహన ఉన్న భారతీయ పౌరుడిగా ఈ విషయాలు చెబుతున్నానని కమల్ స్పష్టం చేశారు. ఈ వ్యాఖ్యలతో ఆయన స్పందన ప్రస్తుతం సోషల్ మీడియాలో వేగంగా వైరల్ అవుతోంది.