అన్నయ్యపై ఫిర్యాదు చేస్తానంటున్న కార్తీ!

Karthi Makes Fun On His Brother

తమిళ హీరోలు అయిన సూర్య మరియు కార్తీలకు మెగా బ్రదర్స్‌ అంటూ పేరుంది. తెలుగులో మెగా బ్రదర్స్‌ చిరంజీవి మరియు పవన్‌ల మాదిరిగా సూర్య మరియు కార్తీలు వరుసగా చిత్రాలు చేసుకుంటూ కింది స్థాయినుండి స్టార్స్‌గా ఎదిగారు. వీరిద్దరి మద్య మంచి సన్నిహిత సంబంధాలు ఉంటాయి. ఇద్దరు అన్నదమ్ములు కూడా తెలుగులో మంచి విజయాలను దక్కించుకుంటూ ముందుకు వెళ్తున్నారు. తాజాగా కార్తీ హీరోగా తమిళంలో తెరకెక్కిన చిత్రాన్ని తెలుగులో ‘చినబాబు’గా ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చేందుకు సిద్దం అయ్యారు. ఈనెల 13న ఈ చిత్రాన్ని విడుదల చేసేందుకు సిద్దం అయ్యారు. ఇక ఈ చిత్రాన్ని సూర్య నిర్మించాడు.

చిత్ర నిర్మాణం సమయంలో కార్తీకి సూర్య పారితోషికం ఏమీ ఇవ్వలేదట. సినిమా విడుదలైన తర్వాత సక్సెస్‌ అయ్యి, లాభాలు వస్తే అప్పుడు పారితోషికం ఇస్తాను అంటూ ముందే కమిట్‌ అయ్యాడట. దాంతో సినిమాపై నమ్మకంగా ఉన్న కార్తీ సినిమా విడుదలైన తర్వాత సక్సెస్‌ అవ్వడం ఖాయం, అప్పుడైనా తన పారితోషికం తనకు ఇవ్వకుంటే మాత్రం అన్నయ్య సూర్యపై ఫిర్యాదు చేస్తాను అంటూ సరదాగా చెప్పుకొచ్చాడు. సూర్యపై ఫిర్యాదు చేస్తానంటూ కార్తీ చేసిన వ్యాఖ్యలకు అన్న సూర్య ఎలా రియాక్ట్‌ అవుతాడో చూడాలి. తెలుగు రాష్ట్రాల్లో చినబాబును భారీ ఎత్తున విడుదల చేసేందుకు సన్నాహకం చేశారు. సాహేశా సైగల్‌ హీరోయిన్‌గా నటించిన ఈ చిత్రంలో కార్తీ రైతు పాత్రలో కనిపించబోతున్నాడు. రైతు సమస్యలు, ఊర్లో పరిస్థితులు ఇలా పలు విధాలుగా చిత్రంలో దర్శకుడు పాండిరాజ్‌ చూపించినట్లుగా తెలుస్తోంది.