పోలీసులకు షాక్.. తుపాకీతో ఖైదీ పరార్.

తెలంగాణలోని నిజామాబాద్ లో ఓ వింత ఘటన చోటుచేసుకుంది. ఏకంగా పోలీస్‌పై దాడి చేసి ఓ ఖైదీ తుపాకీతో పరారయ్యాడు. అనారోగ్యం పేరుతో నిజామాబాద్ ఎస్కార్ట్ పోలీసులపై దాడి చేసి ఓ ఖైదీ పరారయ్యాడు. తుపాకీతో ఉడాయించాడు. అనారోగ్యానికి గురైన ఆ ఖైదీని ఆస్పత్రికి తరలిస్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది.

తాజాగా నిజామాబాద్‌‌ పట్టణంలో రాత్రిపూట ఈ ఘటన జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నిజామాబాద్‌ గౌతంనగర్‌కు చెందిన ప్రసాద్‌ అనే వ్యక్తిని దొంగతనం కేసులో పోలీసులు అరెస్ట్ చేశారు. జిల్లా కోర్టు ఇతడికి జ్యుడీషియల్ రిమాండ్‌ విధించడంతో పోలీసులు అతడిని సారంగపూర్ జైలుకు తరలించారు.

కాగా జైల్లో ఉన్న ఖైదీ అనారోగ్యానికి గురి కావడంతో పోలీసులు నిజామాబాద్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రి నుంచి తిరిగొస్తున్న సమయంలో నిందితుడు ఎస్కార్ట్ పోలీసులపై దాడిచేసి పరారయ్యాడు. కాగా కానిస్టేబుల్ వద్ద ఉన్న తుపాకీ (షార్ట్ వెపన్)తో పారిపోయిన ఖైదీ కోసం పోలీసులు తీవ్రంగా గాలిస్తున్నారు.