క్రియేటివ్ డైరెక్టర్ కృష్ణ వంశీ చాలా ఏళ్లుగా సక్సెస్ కోసం ప్రయత్నాలు చేస్తూనే ఉన్నాడు. ఈమద్య ఈయనతో సినిమాలు చేసేందుకు పెద్దగా స్టార్స్ ఆసక్తి చూపడం లేదు. దాంతో కృష్ణవంశీ సినిమాలు చాలా వరకు తగ్గాయి. రామ్ చరణ్తో ‘గోవిందుడు అందరి వాడేలే’ చిత్రాన్ని తెరకెక్కించి సక్సెస్ను దక్కించుకోలేక పోయిన కృష్ణ వంశీ ఆ తర్వాత కూడా సినిమాలు చేసినా ఏవి కూడా ఫలితాన్ని ఇవ్వలేక పోయాయి. తాజాగా క్రియేటివ్ డైరెక్టర్ కృష్ణవంశీ ఒక రీమేక్ను ప్లాన్ చేస్తున్నట్లుగా సమాచారం అందుతోంది. మరాఠిలో తెరకెక్కిన నట సామ్రాట్ అనే చిత్రాన్ని తెలుగులో రీమేక్ చేయబోతున్నాడు.
మరాఠిలో నానా పటేకర్ ప్రధాన పాత్రలో నటించాడు. ఒక సినిమా పరిశ్రమకు చెందిన స్టార్, తన గతంను మర్చి పోయి పడ్డ ఇబ్బందులను ఈ చిత్రంలో చూపించడం జరిగింది. నట సామ్రాట్ అద్బుతమైన విజయాన్ని సొంతం చేసుకోవడంతో పాటు విమర్శకుల ప్రశంసలు దక్కించుకుంది. అందుకే ఈ చిత్రంను తెలుగులో రీమేక్ చేయాలని కృష్ణవంశీ ఆశ పడుతున్నాడు. నానా పటేకర్ పోషించిన పాత్రను ప్రకాష్ రాజ్తో చేయించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఈ చిత్రాన్ని దిల్రాజు నిర్మించబోతున్నాడు. ఇప్పటికే సినిమాకు సంబంధించిన రైట్స్ను ఆయన దక్కించుకున్నట్లుగా తెలుస్తోంది. భారీ ఎత్తున అంచనాలున్న ఈ చిత్రంపై సినీ వర్గాల్లో ఆసక్తి నెలకొంది. అయితే క్రియేటివ్ డైరెక్టర్ అన్న పేరున్న దర్శకుడు కృష్ణవంశీ ఇలా రీమేక్ చేయడంపై ఆయన అభిమానులు కాస్త నిరాశను వ్యక్తం చేస్తున్నారు. ఈ సినిమాతో మరోసారి తన స్టామినాను చూపించాలని కృష్ణ వంశీ ప్రయత్నాలు చేస్తున్నాడు.