అన్నదమ్ముల్ల్లా కలిసి పెరిగాం…విభేదాలు లేవు !

KTR And Harish Rao Meeting In Sircilla

టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ హయాంలో తెలంగాణ వేగంగా అభివృద్ధి చెందుతోందని, మరోసారి తమ పార్టీని గెలిపించాలన్నారు తాజా మాజీ మంత్రి కేటీఆర్. మరో 15 ఏళ్లపాటు కేసీఆరే సీఎంగా కొనసాగాలని హరీశ్ రావు, తాను కోరుకుంటున్నట్లు తెలిపారు. అందరు అనుకున్నట్లుగా బావ హరీశ్‌తో తనకు ఎలాంటి విభేదాలు లేవన్నారు. తమ మధ్య పోటీ ఎప్పటికీ ఉంటుందని, అయితే కేవలం అభివృద్ధి, పాలన పరంగా మాత్రమేనని స్పష్టం చేశారు. హైదరాబాద్‌లో గురువారం నిర్వహించిన సిరిసిల్ల కార్యకర్తల సమావేశంలో కేటీఆర్ ఈ వ్యాఖ్యలు చేశారు.

KTR

హరీశ్, తాను సొంత అన్నదమ్ముల్లా కలిసి పెరిగామన్నారు. ఉద్యమకాలం నుంచి హరీశ్‌తో పాటు తాను కూడా తెలంగాణ రాష్ట్ర సాధన కోసం పనిచేశానని చెప్పారు. తామిద్దరం ఒకే కేబినెట్‌లో కలిసి పనిచేస్తామని తాను అనుకోలేదన్నారు. ఇద్దరం కలిసి ఇలా ఒకే క్యాబినెట్లో పనిచేసే అవకాశాన్ని తెలంగాణ ప్రజలు ఇచ్చారని భావిస్తున్నట్లు చెప్పారు. హరీశ్‌తో ఏ విషయంలో పోటీ పడినా మోజారిటీ విషయంలో మాత్రం సిద్దిపేటను దాటలేం అన్నారు. వచ్చే ఎన్నికల్లో టీఆర్ఎస్‌కు భారీ విజయం అందించాలని కోరారు.

Harish rao

ఆపద్ధర్మ మంత్రి కేటీఆర్‌కు, తనకు మధ్య ఎలాంటి విభేదాలు లేవని అన్నాదమ్ముల్లా కలిసి పెరిగిన తాము తెలంగాణ ప్రజల కోసం ఒకే కేబినెట్‌లో పనిచేశామన్నారు. టీఆర్ఎస్ సిరిసిల్ల కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడుతూ సిరిసిల్లలో రికార్డు స్థాయి మెజారిటీతో కేటీఆర్‌ను గెలిపించాలని పిలుపునిచ్చారు. రాజకీయంగా తమ మధ్య ఎలాంటి విభేదాలు లేదని, కేవలం అభివృద్ధి విషయంలో పోటీ పడతామన్నారు. సిరిసిల్ల, సిద్దిపేట నియోజకవర్గాలు అభివృద్ధి విషయంలో పోటీపడి ముందుకు సాగాలని ఆకాంక్షించారు. తన నియోజకవర్గం సిద్దిపేట మెజారిటీని సిరిసిల్ల బద్దలుకొట్టాలంటూ సిరిసిల్ల కార్యకర్తలలో ఉత్సాహాన్ని నింపారు హరీశ్.